ఏపీ రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీకి తప్పిన ప్రమాదం- టూ వీలర్ను ఢీకొన్న కారు
ఇవాళ ఏపీలోని కృష్ణాజిల్లాలోని జాతీయ రహదారిపై ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో వేగంగా ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. వాహనం కూడా దెబ్బతింది. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఇది రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీ కారుగా గుర్తించారు.
కృష్ణాజిల్లా కంచికచర్ల శివార్లలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఉదయం కారు- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీ కృపానంద త్రిపాఠీ ఉజేలా ప్రయాణిస్తున్న ఈ అధికారిక వాహనం వేగంగా ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చిన టీవీఎస్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. కారు వేగానికి టీవీఎస్ను ఢీకొట్టాక రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న అధికారులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అదనపు డీజీతో పాటు ఇతర అధికారులు వేరే వాహనం తెప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న స్దానిక పోలీసులు ద్విచక్ర వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. గాయపడిన వాహన దారుడితో పాటు టీవీఎస్పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని ముందు స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం వారిని విజయవాడ ఆస్పత్రికి పంపినట్లు తెలుస్తోంది.