మున్సిపల్ పోరులోనూ వైసీపీకి నిమ్మగడ్డ షాక్- ఆ నామినేషన్ల విత్ డ్రా చెల్లదంటూ- మరో ఛాన్స్
ఏపీలో పంచాయతీ పోరులో వైసీపీ సర్కారుకు వరుసగా షాకులు ఇస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు తాజాగా ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వాటిని కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ గతంలో బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిన చోట వాటిని పునరుద్ధరించాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయం పలు చోట్ల వైసీపీ పాలిట శాపంగా మారబోతోంది.
కొడాలికి నిమ్మగడ్డ మరో షాక్- కేసు నమోదుకు కృష్ణా ఎస్పీకి ఆదేశాలు- హైకోర్టులో పిటిషన్ వేళ
మున్సిపల్ పోరులోనూ జగన్కు నిమ్మగడ్డ షాకులు
పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి ఓ అనూహ్య షాకిచ్చారు. గతంలో ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించడం ద్వారా గతంలో వేసన నామినేషన్లకు ఆమోద ముద్ర వేశారని భావిస్తున్న తరుణంలో వాటిపై సర్కారుకు, వైసీపీ పార్టీకి షాకిచ్చేలా నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మున్సిపల్ పోరులో అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టించటం ఖాయంగా కనిపిస్తోంది.
బలవంతపు ఉపసంహరణలు చెల్లవన్న నిమ్మగడ్డ
పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఉండదు. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు తాము నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవడం కోసం ప్రత్యర్ధులతో నామినేషన్ల ఉపసంహరణకు దిగుతుంటాయి. గతంలో ఏపీలో వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈసారి మాత్రం వాటి గురించి ప్రస్తావించకుండా తొలుత మున్సిపల్ ఎన్నికల కొత్త షెడ్యూల్ ఇచ్చారు. అయితే అంతలోనే విపక్షాల అభ్యంతరాలతో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై సమీక్షిస్తామని ప్రకటించారు.
బలవంతంగా ఉపసంహరించిన నామినేషన్ల పునరుద్ధరణ
గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వందల సంఖ్యలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన అసాధారణ నామినేషన్ల ఉపసంహరణను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇవాళ ప్రకటించారు. బలవంతపు ఉపసంహరణలు ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ తనకున్న విశేషాధికారాలతో వీటి పునరుద్ధరణకు మొగ్గు చూపుతోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్ధులు ఫిర్యాదు చేసిన చోట నామినేషన్ల పునరుద్ధరణ
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేసి ఉపసంహరించుకున్న అభ్యర్ధులకు ఇప్పుడు వాటి పునరుద్ధరణ కోసం మరో అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీ నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో తమ నామినేషన్ను అసాధారణ పరిస్ధితుల్లో ఉపసంహరించుకున్న అభ్యర్ధులు ఎవరైనా ఉంటే వారు ఎన్నికల అధికారులను, రిటర్నింగ్ అధికారులను సంప్రదించేలా నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్ధితుల్లో వాస్తవ పరిస్దితుల ఆధారంగా తిరిగి వారి నామినేషన్ను పునరుద్ధరించి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఎస్ఈసీ నిర్ణయించారు.