జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఆశాభావం - ఆసక్తికర వ్యాఖ్యలు - ఎస్ఈసీగా తిరిగి బాధ్యతల్లోకి..
దేశంలో ఎక్కడా లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ లో 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్' వ్యవహారం అనేక మలుపులు, రాజకీయంగానూ విమర్శలు, ప్రతివిమర్శలకు చోటుచేసుకున్నా, చివరికా వివాదం పూర్తిగా సమసిపోయినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన ఆయన తన స్థానంలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
రాజధానిపై వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు - ఉపఎన్నికకు సిద్ధం - ఆ 29 ఎమ్మెల్యేలపై ఒత్తిడి?
ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్ఘాటించారు. ఎస్ఈసీ తన పనిని రాజ్యాంగం, చట్టాల ప్రకారం మాత్రమే నిర్వహిస్తుందని, ఈ విషయంలో కమిషన్ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ సర్కారుతో విభేదాల అంశాన్ని ప్రస్తావించకుండానే.. ''ఏపీ ప్రభుత్వం గతంలోనూ నాకు బాగా సహకరించింది. ఇప్పుడు కూడా అదే రీతిలో తోడ్పాడు అందిస్తుందని ఆశిస్తున్నాను'' అని నిమ్మగడ్డ అన్నారు.
కాగా, పునర్నియామకంపై కోర్టు ఉత్తర్వులు, జగన్ సర్కారు ఆదేశాల దరిమిలా సోమవారం విజయవాడ ఆఫీసులో అధికారికంగా ఆసీనులైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వాస్తవానికి శుక్రవారం నాడే బాధ్యతలు చేపట్టానని చెప్పడం గమనార్హం. మార్చిలో స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం, ఏపీలో తనకు రక్షణ లేదని, కేంద్ర బలగాలను పంపాలని కోరుతూ లేఖ రాసిన నిమ్మగడ్డ హుటాహుటిన హైదరాబాద్ పయనం కావడం తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాద్ లోని క్యాంప్ ఆఫీసు నుంచే పని చేస్తోన్న ఆయన.. శుక్రవారమే బాధ్యతలు స్వీకరించానని, ఈ విషయాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేశానని వెల్లడించారు.
మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల్ని ఎస్ఈసీ వాయిదా వేయడాన్ని ఏపీ సర్కారు తప్పు పట్టడం, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ, ఆ స్థానంలో కనగరాజ్ ను నియమించడం, సదరు ఉత్తర్వులను హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించడం, జగన్ సర్కారుపై నిమ్మగడ్డ కోర్టు ధిక్కారం పిటిషన్ సైతం వేయడం, ధిక్కార పిటిషన్ పై స్టేకు సుప్రీం నో చెప్పడంతో ఆయన పునర్నియామకంపై ప్రభుత్వం ఆదేశించడం లాంటి పరిణామాలు తెలిసిందే.