పిటీషన్ విచారణకు రానున్న వేళ.. నిమ్మగడ్డ అనూహ్య నిర్ణయం: కాస్సేపట్లో గవర్నర్తో భేటీ
విజయవాడ: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన షెడ్యూల్ను ఏపీ హైకోర్టు రద్దు చేసిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చేనెలలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ అది. దీన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ ఏపీ హైకోర్టులో పిటషన్ దాఖలు చేయడం.. దాన్ని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం కొట్టేయడం చకచకా సాగిపోయాయి.
అదే వేగంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన తదుపరి కార్యాచరణ వైపు కదులుతున్నారు. ఇందులో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన తొలి అడుగును రాజ్భవన్ వైపు వేయనున్నారు. కొద్దిసేపట్లో ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకోనున్నారు. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ.. జగన్ సర్కార్ రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం పట్ల తీవ్ర అసహనాన్ని నిమ్మగడ్డ వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేయడాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. అదే సమయంలో- పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన గవర్నర్కు వివరించనున్నట్లు చెబుతున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాజ్యంగ విరుద్ధమని ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని అంటున్నారు.
Recommended Video
మరోవంక- పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రమేష్ కుమార్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ కూడా కాస్సేపట్లో విచారణకు రాబోతోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటీషన్పై విచారణ చేపట్టబోతోంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వివరించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నప్పటికీ.. కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించబోతున్నట్లు సమాచారం.