ఏపీలో ఈ నెల 20నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు- సచివాలయ పరీక్షలతో ప్రారంభం..
ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన సిటీ బస్సు సర్వీసులను ఆర్టీసీ ఇంతవరకూ ప్రారంభించలేదు. జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈ నెల 7న సిటీ బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.
Recommended Video
రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు నడపాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల్లోనూ కరోనా అదుపులోనే ఉన్నా పూర్తిస్ధాయిలో తగ్గిందని చెప్పలేని పరిస్ధితి. అయితే ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం పంచాయతీరాజ్శాఖ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటిలో దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల కోసం అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటే ఆయా నగరాల్లో ప్రజా రవాణా పూర్తి స్ధాయిలో అందుబాటులో లేదు. సిటీ బస్సులు కూడా లేకుంటే అభ్యర్ధులకు ఇబ్బందులు తప్పవు. దీంతో ప్రభుత్వం సచివాలయ పరీక్షల దృష్ట్యా సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అనుమతి కోసం ఫైల్ను పంపింది. జవహర్ రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని అనుమతిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.