సభాకాలం వృధా చేస్తున్నారు .. అచ్చెన్నాయుడు వల్లే సభ పాడవుతుందని స్పీకర్ ఫైర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సభలో ఈ రోజు ప్రజావేదిక కూల్చివేతపై వాడివేడి చర్చ సాగింది. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రజావేదిక నిర్మాణంపై 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా అని ప్రజా వేదిక నిర్మాణం గురించి జగన్ వ్యాఖ్యానించగా, తానెప్పుడూ నిబంధనను అతిక్రమించలేదని, ఇక అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహాల మాట ఏంటి అని ప్రశ్నించారు చంద్రబాబు. వాటిని కూడా కూల్చి వేస్తారా అని వాగ్బాణాలు సంధించారు. ఇలా సభలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్న తరుణంలో తనకు మాట్లాడే అవకాశం ఇయ్యాలని అడిగిన అచ్చెన్నాయుడు పై స్పీకర్ విరుచుకుపడ్డారు.
నీ వల్ల ప్రతి రోజు సమయం వృధా అవుతుంది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం అచ్చెన్నాయుడు పై మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు సభలో తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను పదేపదే కోరారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అచ్చెన్నాయుడికి సమయం ఇవ్వలేనని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వ లేను అని చెప్పిన స్పీకర్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను మంత్రులను అడగడానికి కేటాయించిన సమయం కాబట్టి అనేక ప్రశ్నలు ఉంటాయని తమ్మినేని పేర్కొన్నారు. అయినా అచ్చెన్నాయుడు పట్టు పట్టడంతో స్పీకర్ అచ్చెన్న తీరుపై మండిపడ్డారు.
ప్రతిరోజు అచ్చెన్నాయుడు వల్ల సభా సమయం వృధా అవుతుందని, సభకు అచ్చెన్నాయుడు ఇబ్బంది కలిగిస్తున్నారని స్పీకర్ ఫైర్ అయ్యారు. ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి తెలిపారు స్పీకర్.
మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు సమయం కేటాయించిన స్పీకర్ సమయం వృధా చేయకుండా సబ్జెక్టు మాట్లాడాలని సూచించడంతో, మీరు రాసివ్వండి నేను చదువుతాను అంటూ అచ్చన్న స్పీకర్ నే ఎదురు ప్రశ్నించారు. ఇక అప్పుడు కూడా అచ్చన్న పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ నేడు సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు పై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తుంటే అచ్చెన్నాయుడు తీరు సభకు ఇబ్బందికరంగా మారిందని స్పీకర్ వ్యాఖ్యానించారు.