దళిత మహిళ గుడిసెను తగులబెట్టిన వైసీపీ నేతలు: చంద్రబాబు: సాక్ష్యంగా వీడియో క్లిప్
అమరావతి: రాష్ట్రంలో దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో దళితులు, వారి కుటుంబాలపై నిరంతరాయంగా దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని విమర్శించారు. ప్రభుత్వం విఫలమైందని, అందుకే దళితులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అయినంపూడి ఘటన వీడియోను..
కృష్ణాజిల్లా ముదినేపల్లిలో మచ్చా ధనలక్ష్మి అనే దళిత విద్యార్థిని ఇంటిని వైఎస్ఆర్సీపీ నాయకులు తగులబెట్టారని చంద్రబాబు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆమె నివాసం పూర్తిగా కాలిపోయిందని, బుగ్గిపాలైందని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు వైఎస్ఆర్సీపీ నేతలే కారణమంటూ బాధితురాలు మచ్చా ధనలక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ఆగ్రహంతో ఇంటిని తగులబెట్టారని ఆరోపించారు.
15 నెలల కాలంలో వరుస దాడులు..
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమౌతాయని తాము ముందే హెచ్చరించామని చంద్రబాబు అన్నారు. ఈ 15 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రతరం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయిందని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. అధికార పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడటం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు భరించలేకపోతున్నారని చెప్పారు. దళితులు, వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం వారిలో నెలకొన్న అసహనానికి అద్దం పడుతోందని చంద్రబాబు విమర్శించారు.
ప్రేమ వ్యవహారమే కారణమంటూ..
వడాలికి చెందిన సాయిరెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి చివరికి మోసం చేశాడని ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు అయినంపూడికి చెందిన దళిత విద్యార్థిని మచ్చా ధనలక్ష్మి కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఘటనకు దారి తీసిందని తెలుస్తోంది. కేసును వెనక్కి తీసుకోవాలంటూ సాయిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు కొంతకాలంగా బెదిరిస్తున్నారని బాధితురాలు పేర్కొన్నట్లు సమాచారం. కేసు ఉపసంహరించుకోకపోవడంతో సాయిరెడ్డి తరఫు కుటుంబీకులు, బంధువులు మచ్చా ధనలక్ష్మి ఇంటిపై దాడి, తగులబెట్టారని అంటున్నారు.
Recommended Video
నిందితుడు అరెస్టు..
సాయిరెడ్డిని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నారని చెబుతున్నారు. కేసు వెనక్కి తీసుకుంటే.. సాయిరెడ్డి విడుదలవుతారంటూ ఆయన తరఫు బంధువులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఒప్పుకోకపోవడం వల్లే మంగళవారం రాత్రి బాధితురాలి ఇంటికి నిప్పు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను చంద్రబాబు తన ట్వీట్కు జత చేశారు.