వీడియో: ఏపీలో తొలి వ్యాక్సిన్ మహిళకే: ఎవరామె? ఏం చేస్తుంటారు?: జగన్ దగ్గరుండి మరీ పర్యవేక్షణ
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో దీన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఉదయం 10:30 గంటలకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఈ కార్యక్రమం ఆరంభమైంది.
Recommended Video
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?: చరిత్ర సృష్టించిన సామాన్యుడు
ఏపీలో కరోనా వైరస్ వ్యాక్సిన్ను మొదటిగా ఓ మహిళకే అందజేశారు. ఆమె పేరు బీ పుష్ప కుమారి. పారిశుద్ధ్య కార్మికురాలు. వైద్య, ఆరోగ్యశాఖలో స్వీపర్గా పని చేస్తున్నారు. పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఆమెకు అందజేశారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అది. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రి డాక్టర్ ఒకరు పుష్ప కుమారికి వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేశారు.
ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్తో పాటు విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న పుష్ప కుమారిని వారు అభినందించారు. అనంతరం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీజీహెచ్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్లను అందజేశారు.
వీడియో: ఏపీలో తొలి వ్యాక్సిన్ మహిళకే: ఎవరామె? ఏం చేస్తుంటారు?: జగన్ దగ్గరుండి మరీ పర్యవేక్షణ#Vaccine #CoronaVaccine #PositiveNews #YSJagan pic.twitter.com/HWUz6CS1ql
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2021
రాష్ట్రంలో తొలిదశలో వ్యాక్సినేషన్ కోసం 3,87,983 మంది డాక్టర్లు, హెల్త్కేర్ వర్కర్లు వ్యాక్సిన్ను తీసుకోనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 332 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మూడుదశల్లో నిర్వహించిన డ్రైరన్కు అనుగుణంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. ఈ 332 కేంద్రాల్లో వందమందికి చొప్పున తొలిరోజు వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ఒక్క రోజే 33,200 మంది హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు దీన్ని నిర్వహిస్తారు.
వారంలో నాలుగురోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇతరత్రా టీకాలను వేయడానికి ఆటంకం కలగకుండా ఉండేలా ఈ నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 20వ తేదీ తరువాత మరికొన్ని సెషన్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతో వ్యాక్సిన్ తీసుకున్న వారికి 28 రోజుల తరువాత రెండో డోసును ఇస్తారు.