వైసీపీ విజయవాడ మేయర్ అభ్యర్థినిగా ఆమె పేరు ఖరారు? బ్రహ్మణ సామాజిక వర్గం ఓటుబ్యాంకుపై
విజయవాడ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్కు భిన్నంగా.. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలను నిర్వహించనున్నందున.. అన్ని రాజకీయ పక్షాలు ప్రచార బరిలో దిగాయి. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి.
మినీ అసెంబ్లీగా భావించే ఈ ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కదిలి వచ్చారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కర్నూలులో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. విశాఖలో ఒకేరోజు ప్రచారాన్ని ప్రారంభించారు.
75 మున్సిపాలిటీలు..12 మున్సిపల్ కార్పొరేషన్లపై పట్టు కోసం
రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలతో పాటు విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన పోలింగ్. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్టీ గుర్తు రహితంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించిన దూకుడును పట్టణ స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోండగా.. ఆ పార్టీ జైత్రయాత్రను అడ్డుకోవడానికి టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.
విజయవాడ వైపే..
రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా భావించే విజయవాడపైనే అందరి దృష్టీ నిలిచింది. తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ ఏ స్థాయిలో విజయావకాశాలను అందిపుచ్చుకుంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభంజనంలోనూ విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకోగలిగింది. కేశినేని నాని వరుసగా రెండోసార విజయం సాధించారు. ఇఫ్పుడాయన కుమార్తె కేశినేని శ్వేతను టీడీపీ అగ్ర నాయకత్వం.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.
వైసీపీ నుంచి ఎవరు?
వైసీపీ తన మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయంలో రెండు పేర్లు బలంగా వినిపిస్తోన్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితా రెడ్డి, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇద్దరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. దీనిపై నేడో, రేపో ఓ ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. టీడీపీ తమ పార్టీ మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించిన నేపథ్యంలో.. ఇక వైసీపీ కూడా ఖరారు చేస్తుందని చెబుతున్నారు.
పుణ్యశీల వైపే మొగ్గు?
వైసీపీ అగ్ర నాయకత్వం.. బండి పుణ్యశీల వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన పుణ్యశీలను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే.. కార్పొరేషన్ పరిధిలో బలంగా ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి వీలు ఉంటుందని భావిస్తోన్నారు. పుణ్యశీలకు ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం కూడా ఉండటం కలిసి వస్తోందని చెబుతున్నారు.
లిఖిత రెడ్డిని ఎంపిక చేయడం వల్ల.. రెడ్డి సామాజిక వర్గానికి అందలం ఎక్కించారనే విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా- లిఖిత రెడ్డి తండ్రి గౌతమ్ రెడ్డిని ఇప్పటికే ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్గా నియమించింది. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇవ్వడం కూడా సరికాదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది.