ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని
సీఆర్డీఏలో భూముల కొనుగోలులో జరిగిన తప్పులను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందజేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలను రావు కమిటీ పరిగణలోకి తీసుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. జనవరి మొదటివారంలో బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేయడానికి హై పవర్ కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాకు తెలిపారు.
డిసెంబర్ 31కి ముందు...
2014 డిసెంబర్ 31వ తేదీన అమరావతి రాజధానిని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. అంతకుముందు సీఆర్డీఏ పరిధిలో భూములు కొనుగోలు చేసిన వారిపై దర్యాప్తు చేసేందుకు ఆలోచిస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని సీబీఐ, సీఐడీ, సీబీసీఐడీ, లోకాయుక్తతో విచారణ జరిపిస్తామని సంకేతాలు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలో అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న కంపెనీ భారీగా భూములు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ఇళ్లలో పనిచేసే పనిమనిషుల పేర్ల మీద కూడా భూములు కొనుగోలు చేశారని తెలిపారు.
కలల రాజధాని
2015లో అప్పటి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కలల్లో చూపించిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సభ్యులుగా ఉన్న శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధాని గురించి ప్రతిపాదించిందని తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూములను తీసుకున్నారని, ప్రభుత్వానికి సంబంధించి అసైన్డ్ భూమలు, బంజరా భూములు 20 వేల ఎకరాలతో కలిపి మొత్తం 54 వేల ఎకరాలను సేకరించారని గుర్తుచేశారు.
లక్ష 10 వేల కోట్లు..
54 వేల ఎకరాలకు అభివృద్ధి కోసం లక్ష 10 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఐదేళ్లలో రూ.1700 కోట్ల నిధులు మాత్రమే తీసుకొచ్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అప్పు చేసి మరి రూ.5400 కోట్ల పనులు మాత్రమే చేపట్టారని చెప్పారు.
5 వేల కోట్లే..
అనుభవం ఉన్న చంద్రబాబే ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు తీసుకొస్తే.. తాము రూ.6 వేల కోట్లు తీసుకొచ్చినా.. రూ.10 వేల కోట్ల మధ్య రాజధాని అభివృద్ధి మిగులుతుందని పేర్కొన్నారు. మిగతా రూ.లక్ష కోట్లు వ్యయం చేయాలంటే ఎన్నేళ్లు కావాలని అడిగారు. ప్రభుత్వం చేపట్టాల్సిన సంక్షేమ పథకాలు ఎక్కడిక్కడ నిలిచిపోవాలా అని అడిగారు.