వీడెక్కడి బిచ్చగాడురా నాయనా..! దానం చేయకుంటే చంపేశాడు
ఉయ్యూరు : దానం చేయలేదని ఓ వ్యక్తిని పరలోకానికి పంపించాడు యాచకుడు. బిచ్చమేయాలంటూ సతాయిస్తే.. కాదు పొమ్మన్నందుకు చంపేశాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కొండబాబు అనే యాభై ఏళ్ల వ్యక్తి బస్టాండ్ సమీపంలోని రైతు బజారులో పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే పట్టణ శివారు ప్రాంతమైన నాగన్నగూడెంకు చెందిన అశోక్ భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు.
2 కోట్ల కొత్త కారు రయ్ రయ్.. నిమిషంలోనే తుక్కు తుక్కు (వీడియో)
అదలావుంటే మంగళవారం భోజన విరామ సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు కొండబాబు. ఆ క్రమంలో బస్టాండ్ ఆవరణలోని ఫ్యాన్ కింద సేద తీరుతున్నాడు. అదే సమయానికి అక్కడకు యాచిస్తూ వచ్చిన అశోక్ దానం చేయాలని కొండబాబును విసిగించాడు. యాచకుడిగా అశోక్ తనకు తెలిసిన వాడే కావడంతో.. "ఎందుకు సతాయిస్తావు, డబ్బులు లేవని చెప్పాగా" అంటూ కసురుకున్నాడు. ఇలా అడుక్కుంటూ అందర్నీ ఇబ్బంది పెట్టే బదులు పనిచేసుకోవచ్చుగా అంటూ విసుక్కున్నాడు. అదే ఆయన పాలిట శాపమైంది.
కొండబాబు మాటలతో అశోక్ కోపోద్రిక్తుడయ్యాడు. ఆయన మెడ పట్టుకుని నులిమేశాడు. బలంగా దాడి చేయడంతో కొండబాబు నోటి వెంట రక్తం కారి అక్కడికక్కడే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.