త్వరలో బెజవాడ దుర్గమ్మ గర్భాలయ ప్రదక్షిణ .....నిర్ణయం తీసుకున్న పాలకమండలి
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇకనుండి అమ్మవారి గర్భాలయ ప్రదక్షిణ చేసుకునే మహదవకాశం దక్కనుంది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది దేవాదాయశాఖ.బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది.
సాధారణంగా ఎక్కడ ఏ దేవాలయంలో నైనా దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసుకునేందుకు వీలు ఉంటుంది. కానీ కనక దుర్గమ్మ దేవాలయంలో ఇంతకు ముందు వరకు అలాంటి అవకాశం లేదు. కనకదుర్గమ్మ భక్తులకు కేవలం గిరి ప్రదక్షిణకు మాత్రమే అవకాశముండేది. అయితే అది చాలా కష్టంతో కూడుకుని వుండేది . అందుకే గర్భాలయ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు.
గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇంతకు ముందు ఎలాంటి ఏర్పాట్లు లేవు. అయితే పాలకమండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో గర్భాలయ ప్రదక్షిణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు గర్భాలయ ప్రదక్షిణకు అవకాశం కల్పిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి టికెట్ ధరను 300 రూపాయలు గా నిర్ణయించారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తామని దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ వెల్లడించారు.