ఏపీ బీజేపీలో భారీ మార్పు: కన్నా ఔట్ - కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం - కారణం ఇదేనా?
మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల మధ్య విచిత్రంగా సాగుతోన్న రాజకీయాలు ఇకపై కొత్త మలుపు తిరగనున్నాయా? టీడీపీకి బీటీమ్ అన్న ముద్రను పూర్తిగా తొలగించుకునే దిశగా కాషాయదళం అడుగులు వేస్తోందా? అధికార వైసీపీపై పోరులో కొత్త ఎత్తుగడలను అవలంభించబోతున్నదా? అంటే, జరుగుతోన్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త సారధిగా సోము వీర్రాజు నియామకం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది.
పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?
ఏపీ బీజేపీకి కొత్త సారధి..
బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సోమవారం రాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు ప్రస్తుతం ఏపీ శాసన మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా, ఏపీ బీజేపీ ఎన్నికల కన్వీనర్ పదవిలోనూ కొనసాగుతోన్న ఆయనకు అనూహ్య రీతిలో సారధ్య బాధ్యతలు దక్కాయి.
కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..
కన్నా ఆశలు గల్లంతు..
ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ గా కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసి ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. గడువు తీరకముందే ఆ స్థానానికి ఎవరు సరిపోతారంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కన్నానే రెండో టర్మ్ కూడా కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కొత్త చీఫ్ పదవికి పోటీ విపరీతంగా ఉండటంతో ఒక దశలో కన్నా సైతం తన కొనసాగింపు ఉంటుందని భావించినా, చివరికి ఆశలు గల్లంతు కాక తప్పలేదనే వాదన వినిపిస్తోంది. అదీగాక, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు చెప్పినట్టల్లా వింటున్నారని కాషాయదళంలోని కొందరు నేతలతోపాటు వైసీపీ కీలక నేతల నుంచీ కన్నా తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజధాని బిల్లుల్ని ఆమోదించొద్దంటూ గవర్నర్ కు కన్నా రాసిన లేఖ పార్టీలో తీవ్ర విభేదాలు సృష్టించింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా, కనీసం ఎవరితోనూ చెప్పకుండా లేఖ రాయడమేంటని కన్నాపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది.
సైలెంట్ గా సోము కొట్టేశారు..
ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పాత్ర గతంలో కంటే పెరిగడం, పార్టీలోకి చేరికలు కూడా భారీగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టాలనుకున్న ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది. ప్రధానంగా, కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ గా ఎమ్మెల్సీ మాధవ్ నియమితులవుతారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన నియామకం ఖరారైనట్లు కూడా వార్తలొచ్చాయి. ఇటీవలి కాలంలో యువనేత విష్ణువర్ధన్ రెడ్డి పేరు మరింత బలంగా వినిపించింది. వారంలోగా విష్ణు పేరుతో ప్రకటన రాబోతుందని ఆయన వర్గీలు చెప్పుకున్నారు. ఎన్టీఆర్ కూతురు, మాజీ ఎంపీ పురంధరేశ్వరికి కూడా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి సోము వీర్రాజు సైలెంట్ గా పదవి దక్కించుకోవడం గమనార్హం.
సోము రాకతో ఫలితం మారుతుందా?
కన్నా స్థానంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించే విషయంలో హైకమాండ్ పాత సమీకరణాలనే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే సమాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్న దరిమిలా కాషాయ దళానికి మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని సారధిగా నియమిస్తే మెరుగైన ఫలితాలు రావొచ్చనే వాదన ఇటీవలి చర్చల్లో బలంగా వినిపించింది. కానీ హైకమాండ్ మాత్రం పాత సమీకరణాలతోనే కొత్త ఫలితాన్ని రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సోము నియామకంతో వెల్లడైంది.
Recommended Video
జగన్పై సాఫ్ట్ కార్నర్ ముద్ర..
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు.. గత అధ్యక్షుడు కన్నా కంటే భిన్నంగా, టీడీపీ చీఫ్ చంద్రబాబును టార్గెట్ చేయడంలో నేర్పరి. అంతేకాదు, అధికార వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ కొనసాగించిన పోరులోనూ సోము అందరికంటే ముందున్నారు. చంద్రబాబు విషయంలో సోము ప్రదర్శించే తీవ్రత.. జగన్ పై ప్రదర్శించే దానికంటే తక్కువగా ఉంటుందని సొంత పార్టీ నేతల్లోనే ఓ అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయాన్ని సోము చాలా సార్లు ఖండించారు. టీడీపీ సహా ఇతర పార్టీల అండ లేకుండానే ఏపీలో బీజేపీ రాణించగలదని సోము పదే పదే వాదిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన నాయకత్వం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, జనసేనతో కలిసి కాషాయదళాన్ని ఆయనెలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.