నీట మునిగిన భవానీ ద్వీపానికి సరికొత్త హంగులు
విజయవాడ: కృష్ణానదికి సంభవించిన భారీ వరదల వల్ల ముప్పావు భాగం నీటిలో మునిగిన భవానీ ద్వీపాన్ని పున: ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చేనెల 1వ తేదీ నాటికి దీన్ని పునరుద్ధరిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. వరదపోటు ప్రభావం వల్ల భవానీ ద్వీపం ఓ మోస్తరుగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. వరదనీరు ప్రవహించడం వల్ల భవానీ ద్వీపం తన సహజసిద్ధమైన అందాలను కోల్పోయింది. సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించినట్లు పర్యాటక శాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ప్రస్తుతం ఈ ద్వీపాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
బీజేపీ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు: శారీరకంగా హింసించారంటోన్న న్యాయ విద్యార్థిని
నిజానికి- భవానీ ద్వీపాన్ని పునరుద్ధరించడానికి కనీసం రెండు నెలల సమయం పట్టొచ్చని మొదట్లో అధికారులు అనుమానించారు. అన్ని రోజుల పాటు పర్యాటకులకు అందుబాటులో లేకుండా చేయడం సరికాదని, దీనివల్ల పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని పర్యాటక మంత్రిత్వశాఖ అభిప్రాయ పడింది. యుద్ధ ప్రాతిపదికన ఈ పర్యాటక కేంద్రాన్ని సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రి ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా అక్కడ చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు నాలుగు అడుగుల ఎత్తు వరకు కృష్ణానదీ వరద ప్రవహించడం వల్ల రూపురేఖలు మారిపోయాయి.
సందర్శకుల మనోల్లాసం కోసం ఏర్పాటు చేసిన కొన్ని రకాల వస్తువులు కొట్టుకుని పోయాయి. ఎకో పార్క్, రోబోటిక్ పార్క్ సహజసిద్ధమైన రూపాన్ని కోల్పోయాయి. కాటేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వరదనీరు చేరుకోవడంతో అవన్నీ బురదమయం అయ్యాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడి్పుడే భవానీ ద్వీపంలో సందర్శకులకు అనుమతి ఇవ్వకపోవచ్చనే నిర్ణయానికి వచ్చారు.
ఈ అనుమానాలను మంత్రి అవంతి శ్రీనివాస్ పటాపంచలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన ద్వీపాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. వచ్చేనెల 1వ తేదీ నాటికి సందర్శకులకు అనుమతి ఇస్తామని చెప్పారు. మరమ్మతులు, పునరుద్ధరణ కార్యక్రమాలు ఏకధాటిగా కొనసాగుతున్నాయని తెలిపారు.