అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
ఏపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందంటూ వైసీపీ సర్కారు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాదని తేలిపోయాయి. అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములను కొనుగోలు చేయడం ద్వారా అనుచితంగా లభ్ది పొందారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులను ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ పరిణామం అధికార వైసీపీ సర్కారుకు భారీ షాక్ కలిగించగా.. విపక్ష టీడీపీకి భారీ ఊరటనిచ్చింది.
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్
2015లో ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతకుముందే రాజధానిని అమరావతిలో పెడుతున్నట్లు సొంత పార్టీ నేతలకు లీకులు ఇవ్వడం ద్వారా ఇక్కడ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసేందుకు సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో విపక్షంలో ఉండగా ఇవే ఆరోపణలు చేసిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ దర్యాప్తుకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఐడీ దర్యాప్తు చేపట్టి అప్పటి మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పలువురిపై కేసులు నమోదు చేసింది.
సీఐడీ కేసులు కొ్ట్టేసిన హైకోర్టు
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబందించి గతంలో సీఐడీ ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా దర్యాప్తు నిర్వహించింది. పలువురు మాజీ మంత్రులతో పాటు అప్పటి అధికారులపైనా కేసులు నమోదు చేసింది. వీటిని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ దాఖలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నింటినీ కొట్టేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు
అమరావతిలో భూములు కొనుగోలు చేసినందుకు తమపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు పెట్టారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే భూములు అమ్మినవారు ఎవరూ ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వం తమపై కక్షసాధిస్తోందని కిలారు రాజేశ్ క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
Recommended Video
జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చిన వైసీపీ సర్కారుకు హైకోర్టు తీర్పుతో భారీ ఎదురుదెబ్బ తగినట్లయింది. విపక్షంలో ఉండగా మొదలుపెట్టిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను ప్రభుత్వంలో వచ్చాక కూడా నిరూపించడంలో వైసీపీ విఫలమైంది. సీఐడీతో ఐపీసీ సెక్షన్ల కింద పెట్టించిన కేసులు కూడా హైకోర్టులో నిలవలేదు. దీంతో అమరావతి భూముల స్కాం అంటూ సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరిన వైసీపీ.. ఇప్పుడు మోహం చాటేయాల్సిన పరిస్ధితి తలెత్తింది.
టీడీపీకి భారీ ఊరట
అమరావతి రాజధాని వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో పక్కనబెడితే ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీకి హైకోర్టు తీర్పు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సీఐడీ ఈ కేసులో ఇరికించిందని ఆరోపణలు చేస్తున్న టీడీపీ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తోంది. ముఖ్యంగా జగన్ సర్కారు కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఎప్పటినుంచో చెబుతోంది. మరోవైపు రాజధాని తరలింపుకు ఓ కారణంగా భావిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది.