విజయవాడలో దారుణం: అదృశ్యమైన చిన్నారి అనంతలోకాలకు.. పక్కింటి ప్రకాశే నిందితుడు..
విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో కనిపించకుండా పోయిన బాలిక విగతజీవిగా మారింది. పక్కింట్లోనే అచేతనంగా కనిపించింది. తమ ఇంటి దీపం నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడు మేకల ప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విగతజీవిగా ద్వారక..
ఆదివారం కనిపించకుండాపోయన ద్వారక అనే ఎనిమిదేళ్ల చిన్నారి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది. పక్క ఇంట్లోనే ఆమె హత్యకు గురవడం కలకలం రేపుతోంది. పక్కింట్లో ఉండే మేకల ప్రకాశ్ హత్యకు గురిచేశాడు. అతడు ఎందుకు హతమార్చాడో కారణాలు తెలియరాలేదు. చిన్నారిని హతమార్చి, గోనె సంచిలో పెట్టాడు. ద్వారకను చూసి కోపోద్రిక్తులైన స్థానికుల ప్రకాశ్పై దాడి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.
తిరిగిరాని బాలిక..
ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. సెలవు రోజు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిందని అనుకొన్నారు. పక్కనే ఉన్న నానమ్మ వద్దకు వెళ్లిందా అని అనుమానించారు. కానీ రాత్రి 9 గంటల వరకు కూడా రాకపోవడంతో ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎవరితో గొడవలు లేవని చెప్పారు. ఆదివారం నుంచి పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
డ్రోన్ కెమెరాలతో జల్లెడ..
ఇవాళ ఉదయం డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడ కనుకొనే ప్రయత్నం చేశారు. డాగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దింపారు. దీంతో పక్కింట్లో చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. పక్కింటికి చెందిన మేకల ప్రకాశ్ చిన్నారిని మట్టుబెట్టాడని గుర్తించారు. అతని ఇంట్లోకి వెళ్లి గోనే సంచిలో ఉన్న చిన్నారిని చూసి నిర్ధారించారు. మేకల ప్రకాశ్ ఎందుకు హత్య చేశాడనే అంశంపై విచారిస్తున్నారు.
విచారణలోనే..
రెండో తరగతి చదువుతున్న ద్వారక ఆడుకునేంది. ఆదివారం చర్చ్కు వెళ్లి ప్రార్థనలు చేసేదని స్థానికులు చెప్తున్నారు. అలాంటి చిన్నారిని ప్రకాశ్ ఎందుకు హత్య చేశాడో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. చిన్నారిని చంపాడనే కోపంతో దేహశుద్ది చేశారు. అప్పటికే అక్కడున్న పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. తమ విచారణలో నిజనిజాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెప్తున్నారు.