కరోనా వైరస్ కన్నా వైసీపీ ఫ్యాక్షన్ యమ డేంజర్: ఎన్నికల వాయిదా సరికాదు..మొత్తానికే: బీజేపీ డిమాండ్..!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
జగన్.. తానుకొటి తలిస్తే కరోనా వేరొకటి తలచింది: వైరస్ మిగిల్చిన నష్టం రూ. 5000 కోట్లు..!
ఎన్నికలను వాయిదా వేయడం కంటే కూడా మొత్తానికే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన ఎన్నికల ప్రక్రియ మొత్తాన్నీ రద్దు చేయాలని, మొదటి నుంచీ వాటిని నిర్వహించాలని పట్టుపడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ కంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న ఫ్యాక్షన్ విధానాలు అత్యంత భయంకరమైనవిగా ఆయన అభివర్ణించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటిదాకా చోటు చేసుకున్న దారుణాలు, వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రాణాంతక దాడులను తాము గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దీనితో పాటు ఎన్నికల అధికారులను కూడా కలిసి వినతిపత్రాన్ని అందజేశామని చెప్పారు. తమ విజ్ఙప్తులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల అధికారులు స్థానిక పోరును వాయిదా వేయడం పట్ల కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ఫ్యాక్షన్ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా ఉండటానికి ఇప్పటిదాకా జరిగిన మొత్తం ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ తాము మరోసారి ఎన్నికల కమిషన్ అధికారులను కలుస్తామని వెల్లడించారు. మరోసారి ఆయనకు వినతిపత్రాన్ని అందజేస్తామని, తమ విజ్ఙప్తుల పట్ల ఆయన సానుకూలంగా స్పందిస్తారని తాను ఆశిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.