వైఎస్ జగన్ కు థ్యాంక్స్ చెప్పిన కన్నా: త్వరలో సమావేశమయ్యే ఛాన్స్?
Recommended Video
అమరావతి: రాష్ట్ర రాజకీయల్లో తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం తెరమీదికి వచ్చింది. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టుండి తన స్వరాన్ని మార్చారు. వైఎస్ జగన్ కు థ్యాంక్స్ చెప్పారు. వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. త్వరలో ఆయన వైఎస్ జగన్ ను కలుసుకోవచ్చని తెలుస్తోంది. ట్వీట్ చేసిన వెంటనే.. ఆ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడం ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనుసరిస్తోన్న వైఖరి పట్ల కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో- ఆయన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ ను హాలీవుడ్ కు తీసుకెళ్లిన సాహో: అనంత మారుమూల గ్రామంలో సంబరాలు: లింకేంటీ?
థ్యాంక్స్ ఎందుకంటే..
కొన్నిరోజులుగా రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోని రైతులకు కౌలు మొత్తాన్ని చెల్లించే విషయంలో జాప్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదును జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. జూన్ నుంచి కౌలు మొత్తం ఆగిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కౌలు మొత్తాన్ని విడుదల చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలంటూ వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా- వారు ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. కౌలు మొత్తాన్ని విడుదల చేసే అంశంపై కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లించకపోవడం సబబు కాదని హితవు పలికారు. ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన కౌలు మొత్తాన్ని ఇంకా మంజూరు చేయలేదని, ఫలితంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కన్నా తన లేఖలో వివరించారు. రైతులకు వెంటనే కౌలు మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
187 కోట్ల రూపాయలు విడుదల..
కౌలు మొత్తాల విడుదల విషయంలో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రాజధాని ప్రాంత రైతులకు రావాల్సిన రూ.187.40 కోట్ల కౌలు నిధులను సర్కారు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ కౌలు మొత్తం చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కౌలు మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. తాను రాసిన బహిరంగ లేఖపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించడం హర్షణీయమని చెప్పారు. తాను రాసిన లేఖపై స్పందిస్తూ 187.40 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
రాజధాని తరలింపుపైనా క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్..
రాజధాని ప్రాంతానికి చెందిన రైతుల కౌలు మొత్తాన్ని విడుదల చేయడంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాజధాని తరలింపుపైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. తరలింపుపై ముఖ్యమంత్రి ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని తరలింపు వ్యవహారంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. తరలింపు ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు. రైతులతో పాటు వందలాది మంది కార్మికులు, ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోన్న ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, వివరణ ఇవ్వాలని, ఈ వివాదానికి ముగింపు పలకాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇదిలావుండగా.. కారణాలేమైనప్పటికీ- త్వరలోనే ఆయన వైఎస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.