బీజేపీ నేతలతో సోము వీర్రాజు వరుస భేటీలు - సుజనా, పురంధేశ్వరితో కీలక మంతనాలు..
ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్నా అంతర్గత పోరుతో సతమతం అవుతున్న బీజేపీని గాడిన పెట్టేందుకు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీలో తనతో విభేదిస్తున్న కీలక నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరిని హైదరాబాద్ వెళ్లి మరీ కలుసుకున్నారు. అమరావతి విషయంలో పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వెళ్తున్న వీరిద్దరితో సోము వీర్రాజు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్ లో సుజనా చౌదరి, పురంధేశ్వరితో సోమువీర్రాజు మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించినా.. అంతర్గత పోరు నేపథ్యంలో వీరి మధ్య కీలక మంతనాలు జరిగి ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సోము వీర్రాజుకు భవిష్యత్తులో వీరిద్దరి మద్దతు తప్పనిసరి. అదీ కాక అమరావతి ప్రాంతంలో రైతులకు మద్దతుగా పోరాటాలు చేయాలని మిత్రపక్షం జనసేన కూడా భావిస్తున్న తరుణంలో అక్కడి రైతుల మద్దతు ఉన్న ఈ ఇద్దరు నేతలను దారిలోకి తెచ్చుకోవాలని సోము భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన సోము వీర్రాజు ఇప్పటికే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఇప్పుడు పార్టీలో కీలకమైన ఇద్దరు నేతలతో భేటీ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు సోము వీర్రాజు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది.