గవర్నర్ హరి చందన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం .. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై ఫిర్యాదు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో బిజెపి ప్రతినిధుల బృందం ఏపీ లోని పరిస్థితులను గురించి గవర్నర్ హరి చందన్ ను కలిశారు. ఏపీ లోని తాజా పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన పై , ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గవర్నర్ గా చొరవ తీసుకోవాలని బిజెపి నేతలు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు
ఏపీ సర్కార్పై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫైర్ .. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రాలు
ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై గవర్నర్ హరిచందన్ కు వినతిపత్రం ఇచ్చామని కన్నా తెలిపారు. పెళ్లికి ముహూర్తం పెట్టినట్టుగా ఏపీ సీఎం జగన్ ఇసుకను అందుబాటులోకి తీసుకురావడానికి సెప్టెంబర్ 5 అని ముహూర్తం పెట్టారని, కానీ నేటికీ ఇసుక కొరత ఏపీని వేధిస్తోందని ఆయన పేర్కొన్నారు.
లక్షలాది కార్మికులు బజారున పడ్డా సీఎంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని ఆరోపించిన కన్నా లక్ష్మీ నారాయణ ప్రజల ఇసుక కష్టాలు ఇంకా తీరలేదని పేర్కొన్నారు. జగన్ మాత్రం ప్రజల కష్టాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దొరకక కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇసుకను బ్లాక్లో విక్రయిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని మండిపడ్డారు. అంతేకాదు ఆలయ భూములను సొంత భూముల్లా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు చెప్తున్నా, ఎంత విజ్ఞప్తి చేస్తున్నా ఏపీ సీఎం జగన్ తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుంది అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.