పెళ్ళికి ముహూర్తం పెట్టినట్టు ఇసుకకు ముహూర్తం పెట్టారన్న బీజేపీ నేతలు .. ఇసుక కొరతపై ఆగ్రహం
ఏపీలో నెలకొన్న తీవ్రమైన ఇసుక కొరత పరిస్థితుల నేపధ్యంలో నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఎపీలోని ప్రతిపక్ష పార్టీలు పోరాటం సాగిస్తున్నాయి. తాజాగా నేడు కృష్ణా జిల్లా విజయవాడలో బీజేపీ ఇసుక సత్యాగ్రహం నిర్వహిస్తుంది . రాష్ట్రంలో ఇసుక సంక్షోభానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక సత్యాగ్రహంలో బీజేపీ నేతలు, నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు. ఇసుక సత్యాగ్రహంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.
బీజేపీ ఇసుక సత్యాగ్రహం .. వరదలొచ్చి 2 నెలలే .. మీరొచ్చి 6 నెలలు అన్న పురంధరేశ్వరి
జగన్ నేతృత్వంలో నియంతృత్వపాలన సాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆరునెలల పాలనే ఇలా వుంటే ఇంకా నాలుగున్నరేళ్ళ పాలన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని, ఉపాధిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మహుర్తాలు లేవని, కానీ ఇసుక కోసం మాత్రం పెళ్ళికి పెట్టినట్టు ముహూర్తాలు పెట్టారని విమర్శించారు.
చివరకు రాష్ట్రంలో ఇసుక దొంగతనాలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇసుక కొరతకు ప్రభుత్వ విధానాలే కారణం అని పేర్కొన్న ఆయన కృష్ణా, గోదావరి వరదలు వస్తే రాయలసీమలో ఇసుక కొరత ఎందుకు వచ్చిందో చెప్పాలని కన్నా ప్రశ్నించారు.ఇక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు నెలకు 10 వేలు, మరణించిన కార్మిక కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి తిడతారా అని కన్నా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని శ్రీనివాసరావు సైతం వైసీపీ పాలనలో నెలకొన్న ఇసుక కొరతపై మండిపడ్డారు. ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఇసుక పాలసీకి కూడా ముహూర్తం పెట్టడమేంటి..? అని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు నిలదీశారు . వరదల వలన ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతున్న సమాధానం సరైనది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ తీరు మార్చుకుని కార్మికుల కష్టాలు తీర్చాలని బీజేపీ నేత కామినేని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన ఈ ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అధికార పార్టీ విధానాలను, నేతల అసమర్ధతను దుయ్యబట్టారు.