సుజనా చౌదరి,సిఎం రమేష్ లను అనర్హులుగా ప్రకటించండి!...ఎథిక్స్ కమిటీకి ఎంపి జివిఎల్ ఫిర్యాదు
విజయవాడ:టిడిపి రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను అనర్హులుగా ప్రకటించాలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
అసలు ఎథిక్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న టిడిపి ఎంపి సుజనా చౌదరి పైనే దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నందున ఆయనపై ఎంపీగా కొనసాగే నైతిక అర్హత లేనే లేదని జివిఎల్ వాదిస్తున్నారు. బిజెపి ఎంపి జివిఎల్ గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిడిపి ఎంపీలపై తాను ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని వెల్లడించారు.
ఐటీ, ఈడీ దాడుల్లో తమ పార్టీ నేతల అవినీతి వెలుగుచూస్తున్నా ఆ పార్టీ అధినేత, ఎపి సీఎం చంద్రబాబు నిసిగ్గుగా వారిని సమర్థిస్తున్నారని జివిఎల్ దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు చూస్తుంటే తన బినామీలను కాపాడుకునే చందంగా ఉందని విమర్శించారు. టీడీపీ ఎంపీల అవినీతిని చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారని ఎంపి జివిఎల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఆలీబాబా 40 దొంగలు లాగా ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ అంటే దొంగల పార్టీ అని ప్రజలకు తెలిసిపోయిందని జివిఎల్ వ్యంగాస్త్రాలు సంధించారు. టిడిపి నేతలు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటే అలాంటి వారిని సంజాయిషీ అడగకూడదా?...ఇదేం తీరని జివిఎల్ నిలదీశారు. అసలు రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం విశ్వసనీయత లేదని జివిఎల్ ధ్వజమెత్తారు.