ఒక దర్యాప్తు .. ఒక రద్దు కోరుతూ ..ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణ
బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ గవర్నర్ విశ్వభూషన్కు లేఖ రాశారు . ఏపీలో తాజా పరిస్థితులను వివరిస్తూనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని లేఖలో కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ,అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు కూడా చూసిచూడనట్లు వదిలేశారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు .ఈ విషయంపై ఇప్పటికే ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో వివరించారు.
నేను రెడీ.. కన్నా,సుజనా ప్రమాణం చేస్తారా !! పురంధరేశ్వరిని రచ్చలోకి లాగిన విజయసాయి
ఇక చాలా దారుణంగా , ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా జరిపిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ. అంతే కాదు కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు . ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన రాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు . చత్తీస్గఢ్ 350 రుపాయలకు కొనుగోలు చేస్తే అవే కిట్లను ఏపీ ప్రభుత్వం మాత్రం 730కి కొనుగోలు చేసిందని తెలిపారు. అవి కూడా నేరుగా కొనుగోళ్లు జరపకుండా థర్డ్ పార్టీ ద్వారా కొనుగోలు చేశారని, దీని వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు.
Recommended Video
కిట్ల కొనుగోళ్లపై దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు . ఇక ఇప్పటికే కరోనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో కన్నా వర్సెస్ విజయసాయి పెద్ద యుద్ధమే జరిగింది. వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కిట్ల వ్యవహారంలో కాణిపాకం వినాయకుడి సాక్షిగా వార్ జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా స్థానిక ఎన్నికలు రద్దు చెయ్యాలని, అలాగే కిట్ల కొనుగోలుపై దర్యాప్తు చేయించాలని గవర్నర్ ను కోరిన నేపధ్యంలో గవర్నర్ ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .