14 నెలల్లో ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డు వేశారా..? సీఎం జగన్పై బోండా ఉమా విసుర్లు
మూడు రాజధానులు పెట్టాలని సీఎం జగన్ను ఎవరూ అడిగారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఎవరి కోసం రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అడిగారు. ఇదివరకు అమరావతి రాజధానిగా 33 వేల ఎకరాలు కావాలని చెప్పలేదా అని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మీ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానుల అంశాన్ని తెరమీదపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.
ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 14 నెలలుగా ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డు అయిన వేశారా అని ప్రశ్నించారు. రాయలసీమ లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడిగారు. రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి జరగాలని టీడీపీ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిందని వివరించారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు పేదలు అందడం లేదని విమర్శించారు.
జగన్ పాలనలో మొదటి ఎనిమిది నెలల ఇసుక కొరత సృష్టించారని దుయ్యబట్టారు. ఇసుక మాఫియా కోసం భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారని ఆరోపించారు. రాష్ట్రంలో 55 లక్షల మంది కార్మికులు పస్తులతో ఉన్నారని గుర్తుచేశారు. కరోన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉమా మండిపడ్డారు. పారాసిట్ మల్ వేసుకుంటే వైరస్ పోతుంది అని బాధ్యతరహితంగా సీఎం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, మీడియా ప్రతినిధులు, పోలీసులు విధి నిర్వహణలో కరోన బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని బోండా ఉమా తెలిపారు. ప్రజా సమస్యలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 21 రోజుల నుండి నిరశన దీక్షలు చెపడుతున్నామని.. ప్రజలను ఆదుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బోండా ఉమా స్పష్టంచేశారు.