విరిగిపడ్డ కొండచరియ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై బండరాళ్లు: భయాందోళనల్లో భక్తులు
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో కొన్ని గంటలుగా ఏకధాటిగా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అర్ధరాత్రి నుంచీ విజయవాడలో భారీ కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది.
విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతి పరిధిలోని అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. రహదారులను ముంచెత్తింది. తూర్పు గోదావరి జిల్లా తుని-నర్సీపట్నం మధ్య రోడ్డు మీద వరద నీరు ప్రవహించడంతో ఓ కారు అందులో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిని రక్షించారు. మరోవంక- విజయవాడలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి.
కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోకలు సాగించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఉదయం భారీ వర్షం కురుస్తోన్న సమయంలో పెద్ద శబ్దం చేస్తూ బండరాళ్లు ఘాట్ రోడ్డు మీదికి విరిగిపడ్డాయి. ఊహించని ఆ ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్లను తొలగించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
భారీ వర్షం కురుస్తున్నందు వల్ల భక్తులు ఎవరూ ఆ సమయంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణించలేదని అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రులు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. దసరా ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. భక్తుల కోసం బ్యారికేడ్లు, షామియానాలను సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల ఆయా పనులకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు వల్ల దసరా వేడుకల నిర్వహణ కోసం చేపట్టిన పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.