బోయిన్పల్లి కిడ్నాప్లో మరో అరెస్ట్: గోవాలో చిక్కిన కీలక నిందితుడు?: అఖిలప్రియ చుట్టూ ఉచ్చు
విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. కిడ్నాప్ కోసం మనుషులను సరఫరా చేసిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న మద్దాల సిద్ధార్థ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే అతను అజ్ఙాతంలోకి వెళ్లాడు. కొంతకాలంగా గోవాలో తలదాచుకుంటున్నాడు. అతను గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో గోవా వెళ్లిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరో కీలక వ్యక్తి అరెస్ట్ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిల ప్రియ మరింత ఇబ్బందుల్లో కూరుకుని పోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. విజయవాడకు చెందిన సిద్ధార్థ్.. పేరు కొద్దిరోజుల కిందటే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బౌన్సర్గా ఇదివరకు పనిచేసిన అతను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్కు అత్యంత నమ్మకస్తుడని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయడానికి అవసరమైన మనుషులను విజయవాడ నుంచి సిద్ధార్థే పంపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
విజయవాడలో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్గా పనిచేశాడని, అనంతరం జిమ్ ట్రైనర్గా చేరాడనే సమాచారాన్ని సేకరించారు. అతని ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా అతను గోవాలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం లభించడంతో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లి, సిద్ధార్థ్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బౌన్సర్లతో సిద్ధార్థ్కు ఉన్న పరిచయాన్ని భార్గవ్రామ్, గుంటూరు శ్రీను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, అతని ద్వారా కిడ్నాప్ చేయడానికి అవసరమైన మనుషులను సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.