శవాలమీద చిల్లర ఏరుకుని..: విజయసాయికి కోడెల సాయమంటూ ఎమ్మెల్సీ సంచలనం
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టడం వల్లేనని వైసీపీ నేతలు అంటున్నారు.
జగన్ సర్కారు వేధింపులకు పరాకాష్టే కోడెల ఆత్మహత్య: తొలిసారంటూ చంద్రబాబు నిప్పులు
శకునిమామతో కలిసి నీచరాజకీయాలు: కోడెల లేఖను బయటపెట్టిన లోకేష్
విజయసాయికి కోడెల సాయం
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాయం చేశారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్పై అభ్యంతరాలు తెలుపుతూ ఫిర్యాదులు అందాయి. ఆ సమయంలో కోడెలను విజయసాయిరెడ్డి సాయం కోరారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారితో మాట్లాడి విజయసాయి నామినేషన్ ఆమోదింపజేసేలా చేశారని సోషల్ మీడియాలో కొందరు మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు.
శవాల మీద చిల్లర ఏరుకుని..
తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. కోడెల మృతి విషయంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శవాలమీద చిల్లర ఏరుకుని రాజకీయం చేసే నువ్వు కూడా కోడెల గారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది 420 శకుని మామా @VSReddy_MP గారూ! ! రాజ్యసభ ఎన్నికలలో కోడెల గారు నీకు సాయం చెయ్యకపోతే ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తినేవాడివి మరిచిపోయావా? ఒకసారి గతం గుర్తు చేసుకో !' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బుద్ధా వెంకన్న.
నీ దొంగల ముఠా వల్లే..
‘కోడెల గారి మీద కేసు పెడితే సాయం చేస్తా అని నువ్వు పెట్టిన ట్వీట్లు ప్రజలంతా చూసారు. ఇప్పుడు వచ్చి కోడెలగారి మరణాన్ని తెదేపా వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నంగనాచి కబుర్లు చెప్పకు. నువ్వు నీ దొంగల ముఠా వేధింపులవల్లనే పులిలా బ్రతికిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు' అని బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.