పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్
ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు బుద్దా వెంకన్న రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పెట్టుబడి పెట్టేందుకు భారీగా పెట్టుబడిదారులు తరలి వస్తున్నారని,దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు.
ఏపీలో రంగుల రాజకీయం .. వైసీపీ వర్సెస్ టీడీపీ .. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారుగా !!
ఇక గతంలో చంద్రబాబు హయాంలో తండ్రి కొడుకులకు సూట్ కేసులు అందించనిదే భూ కేటాయింపులు జరిగేవి కావని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎవరికీ ఏ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, వాళ్లకు అర్థమైందని అందుకే క్యూ కడుతున్నారని విజయసాయి పేర్కొన్నారు.గతంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్న చెడ్డపేరు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు వైసీపీ ఎంపీ.
ఇక ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పాలన మొదలయ్యాక పారిశ్రామికవేత్తలు క్యూలో నిల్చున్నారా?ఎక్కడో చెప్పండి వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు అయినా ఇస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన, జైలు పక్షులను చూసి పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న మాట వాస్తవమేనని ఆయన విజయసాయిరెడ్డిని ఎద్దేవా చేశారు. ఇక అంతే కాదు తండ్రి అధికారంలో ఉన్ననాడే సూట్ కేస్ కంపెనీలకు జగన్ గాడ్ ఫాదర్ అయ్యారని, మనీలాండరింగ్ కు రింగ్ మాస్టర్ అయ్యారని, క్విడ్ ప్రో కో వ్యవహారానికి కింగ్ పిన్ అయ్యారని బుద్ధ వెంకన్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించారు.