రైతుల్ని ఏడిపిస్తున్న ఘనత మీదే .. మీది పైశాచిక ఆనందం : బుద్దా వెంకన్న ఫైర్
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల పై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు . రైతులు హత్యాయత్నం చేశారంటూ అంటూ వారిపై కేసులు పెట్టినందుకు గానూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల్నిచాలా క్షోభ పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు .
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ పాత ఏడుపులేనా: దమ్ముంటే రాజధానిలో చర్చ పెట్టండని బుద్దా సవాల్
రాజధాని అమరావతిని మార్చే ఆలోచనలో ఉన్న వైసీపీ సర్కార్ 13 రోజుల నుండి నిరసన చేస్తున్న రైతులపై కనీసం స్పందించలేదని పేర్కొన్నారు. ఇక అంతేకాదు రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా, వారి ఆవేదన అర్ధం చేసుకోకుండా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడిగా నిలుస్తారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు .ఇక సీఎం జగన్ రాజధాని విషయంలో బుగ్గన నేతృత్వంలో వేసిన హై పవర్ కమిటీ కేవలం నామామాత్రమే అని, హై పవర్ కమిటీ లో వున్నది వైసీపీ నేతలేనని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
వైసీపీ నేతలు బొత్స సత్య నారాయణ, ధర్మాన ప్రసాద్ ల గురించి మాట్లాడిన వెంకన్న ధర్మాన ప్రసాద్ కు ఇన్నేళ్లు గుర్తు రాని నీళ్ల అవసరం ఇపుడు తెరమీదికి తీసుకు రావడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు . విజయసాయిరెడ్డికి నీతి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న కేసులో చిప్ప కూడు తిన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు. రైతుల్ని ఏడిపిస్తున్న ఘనత దేశంలో మరే ప్రభుత్వానికి లేదని చెప్పిన బుద్దా వెంకన్న జగన్ ప్రభుత్వానిదే ఆ ఘనత అని తేల్చి చెప్పారు.