సీఎం జగన్కు నానీ జీ హుజూర్.. అన్నీ మూసుకుని ఆంధ్రులందరి మాట విందాం.. పీవీపీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదిక ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. రాజధాని అమరావతి మార్పు జరుగుతుందన్న వార్తల నేపధ్యంలో రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక మరోపక్క ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ మండిపడుతోంది. ఇక బెజవాడ టీడీపీ, వైసీపీ నాయకులు ట్విట్టర్ వేదికగా దీనిపై పోస్టులు పెడుతున్నారు.
అమరావతి నుంచి రాజధాని మార్చి నీ గొయ్యి నువ్వు తవ్వుకోవద్దన్న నానీ
టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నానీ జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని చెప్తూ రాజధాని అమరావతి విషయంలో జగన్ అన్నా... ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు అమరావతి నుంచి రాజధాని మార్చి నీ గొయ్యి నువ్వు తవ్వుకోవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు రాజధాని ప్రాంతంలోని రాజకీయ నాయకుల పోకడ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతల వింత పోకడ.. ఎక్కడా చూడలేదన్న బెజవాడ ఎంపీ
ప్రపంచం లో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదు ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కోరుకునే ప్రజాప్రతినిధులను, పోరాడే నాయకులను చూసాము .కానీ మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండటం మన కర్మ అంటూ ట్వీట్ చేశారు కేశినేని నానీ. అమరావతి నుంచి రాజదాని మారుస్తున్న మన జగన్ అన్న .. పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు అని అంటూ పేర్కొన్న కేశినేని నానీ జగన్ తీరుపై విరుచుకుపడ్డాడు.
అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందామన్న పీవీపీ
ఇక నానీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పీవీపీ ఏపీ రాజధాని విషయంలో ప్రజల మాట వినాలే తప్ప, చంద్రబాబు చెప్పినట్టుగా మాట్లాడరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పీవీపీ, విజయవాడ ఎంపీ కేశినేని నానికి హితవు పలికారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన పీవీపీ,రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ... ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నాని అని సెటైర్లు వేశారు పీవీపీ .
సోషల్ మీడియాలో వీరి పోస్ట్ లపై మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
కేశినేని నానీ పీవీపీలు చాలా కాలంగా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో బెజవాడ రాజకీయాలను వేదేక్కిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా పీవీపీ కేశినేని నానీ టార్గెట్ గా చెలరేగిపోతుంటారు . తాజాగా మూడు రాజధానుల విషయంలో కూడా అదే చేశారు. ఇక పీవీపీ, కేశినేని నానీల ట్వీట్ లపైనెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.