కారులో ముగ్గురిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఒకరికీ సీరియస్, పరారీలో నిందితుడు...
రియల్ ఎస్టేట్ వివాదం ముగ్గురిని కారులో ఉంచి సజీవ దహనం చేసేందుకు ఉసిగొల్పింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడలో సోమవారం సాయంత్రం జరిగిన ఘటన కలకలం రేపింది.
సోమవారం విజయవాడ నోవాటెల్ హోటల్ వద్ద కృష్టారెడ్డి, గంగాధర్, నాగవల్లి, వేణుగోపాల్ రెడ్డి ఆగారు. కారులో కూర్చొని రియల్ లావాదేవీలపై డిస్కష్ చేస్తున్నారు. ఇంతలో వేణుగోపాల్ రెడ్డి కారుదిగాడు. లోపల ముగ్గురు ఉండగా.. బయటనుంచి లాక్ చేసేశాడు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. కారులో ఉన్న ముగ్గురు ఎలాగోలా తప్పించుకోగలిగారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కృష్ణారెడ్డికి సీరియస్ ఉన్నట్టు తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి హర్షవర్ధన్ రాజు తెలిపారు.
గంగాధర్, వేణుగోపాల్ కలిసి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి విక్రయించేవారు అని రాజు తెలిపారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో వారు విడిపోయారు. దీనిపై మాట్లాడేందుకు వేణు ప్రయత్నించగా.. గంగాధర్ స్పందించలేదు. సోమవారం సాయంత్రం మాత్రం గంగాధర్ తన భార్య నాగవల్లి, స్నేహితుడు కృష్ణారెడ్డితో కలిసి వేణును కలిసేందుకు వెళ్లారని.. నలుగురు దీనిపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4.45 గంటలకు సిగరేట్ తాగుతానని చెప్పి వేణు కారు దిగిపోయాడని చెప్పారు. తర్వాత విస్కీ బాటిల్లో తీసుకొచ్చిన పెట్రోల్ కారు మీద పోసి.. నిప్పంటించి పారిపోయాడని వివరించారు. ప్రజలు చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి.
స్థానికులు వారిని కాపాడారు. గంగాధర్ నాగవల్లి దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. స్నేహితుడు కృష్ణారెడ్డి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. గంగాధర్ భార్య నాగవల్లిని ఇంటికి పంపించగా.. స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత గంగాధర్ ఇంటికి వెళ్లిపోయారు. చట్టపరమైన ఫార్మాలిటీ పూర్తిచేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని రాజు తెలిపారు.