స్వర్ణ ప్యాలెస్ మృతుల వివరాలు ఇవే: స్వర్ణ ప్యాలెస్పై ఎఫ్ఐఆర్: రమేష్ ఆసుపత్రిపైనా కేసు
విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతంపై నగర పోలీసులు రంగంలోకి దిగారు. ప్రైవేటు భవన సముాయాన్ని కోవిడ్ సెంటర్గా మర్చడానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించలేదంటూ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో.. కేసు నమోదు చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో పాటు, కోవిడ్ సెంటర్ను నిర్వహిస్తోన్న రమేష్ ఆసుపత్రిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటిదాకా 11 మంది మరణించినట్లు సమాచారం అందింది.
Recommended Video
మృతుల వివరాలు ఇవే..
రమేష్-విజయవాడ, పూర్ణచంద్ర రావు.. మొవ్వ (కృష్ణాజిల్లా), డొక్కు శివ బ్రహ్మయ్య-మచిలీపట్నం, మజ్జి గోపి-మచిలీపట్నం, సుంకర బాబురావు-విజయవాడ (అజిత్సింగ్ నగర్), వెంకటలక్ష్మి సువర్చలా దేవి-కందుకూరు (ప్రకాశం జిల్లా), సువర్ణ లత-నిడుబ్రోలు (గుంటూరు జిల్లా), పవన్ కిషన్-కందుకూరు (ప్రకాశం జిల్లా), అబ్రహం-జగ్గయ్యపేట, రాజకుమారి-జగ్గయ్యపేట మరణించినట్లు నిర్ధారించారు. వారిలో సుంకర బాబురావు ఎస్ఐగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. అబ్రహ్మం, రాజకుమారి భార్యాభర్తలు. అబ్రహం జగ్గయ్యపేటలో చర్చిఫాదర్గా పనిచేస్తున్నారు. మరొకరి మృతదేహాన్ని పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది.
రమేష్ ఆసుపత్రి, హోటల్ యాజమాన్యంపై
నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై విజయవాడ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పీ జయశ్రీ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. ఐపీసీ 304 (2), 308, ఆర్/డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం, హోటల్ స్వర్ణ ప్యాలెస్ మేనేజ్మెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గవర్నరు పేట పోలీసులు ఈ కేసును నమోదు చేసుకున, దర్యాప్తు చేపట్టారు. విజయవాడ సెంట్రల్ తహశీల్దారు కూడా ఇదే అంశంపై గవర్నరు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా..
స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కోవిడ్-19 సెంటర్గా మార్చే సమయంలో నిర్వాహకులు అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకోలేదని అన్నారు. మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై సమగ్ర దర్యాప్తును చేపట్టామని తెలిపారు. త్వరలోనే హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తామని విజయవాడ సెంట్రల్ తహశీల్దారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో స్వర్ణ ప్యాలెస్లో అలారం మోగాల్సి ఉందని, అలా జరగలేదని అన్నారు. చోటు చేసుకున్న వెంటనే అలారం మోగేలా నిబంధనలను రూపొందించామని చెప్పారు.