జగన్ కేసుల్లో సీబీఐ కొత్త ట్విస్ట్: చార్జిషీట్లలో వేర్వేరుగానే విచారణ: నిందితులే బాధితులుగా..!
సీఎం జగన్ మీద నమోదై ఉన్న సీబీఐ కేసుల్లో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. జగన్పై చార్జిషీట్లలో వేర్వేరుగానే విచారణ జరగాలని..సీబీఐ కోర్టు ముందు తమ వాదన వినిపించింది. ఒకే తరహా నేరమైనా విడివిడిగా జరిగాయని కోర్టు ముందు ప్రస్తావించింది. నేరం జరిగిన సమయం..సమయం..పెట్టుబడులు..నిందితులూ వేర్వేరంటూ వాదనలు కొనసాగింది. అన్నింటినీ కలిపి విచారించాలనడం చెల్లదంటూ వాదించింది. గతంలోనే కోర్టు దీనిపై స్పష్టత ఇచ్చిందని కోర్టుకు నివేదించింది. బిహార్లో లాలూ కేసులోనూ ఇదే జరిగిందనే విషయాన్ని గుర్తు చేసింది. రకరకాల పిటిషన్లతో విచారణలో జాప్యం అవుతుందని పేర్కొంది. డిశ్చార్జి పిటిషన్లు తేలిన వాటిపై ట్రయల్ జరపాలని..హైకోర్టులోనూ దీనిపై ప్రజా ప్రయోజన దాఖలైందంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో చేసిన వాదన ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది.
తిరిగి అధికారం దక్కటమే మైలురాయి: వైయస్ చెప్పిన చోట నుండే రచ్చబండ: సీఎం జగన్ కీలక ఆదేశాలు..!
జగన్ వాదనకు భిన్నంగా..
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. తనపై దాఖలైన చార్జిషీట్లను ఒక్కటిగా పరిగణించి, ఒకేసారి విచారణ జరపాలన్న జగన్ వాదనతో సీబీఐ విభేదించింది. తమ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన 6 చార్జిషీట్లను సీఆర్పీసీ సెక్షన్ 223 కింద కలిపి విచారించాలంటూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విచారణ జరిపారు. జగన్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ ఒకటే నమోదు చేసినప్పటికీ.. క్విడ్ప్రోకో తరహాలో వేర్వేరుగా జరిగిన ఆర్థికలావాదేవీల ఆధారంగా ఛార్జ్ షీట్లు దాఖలయ్యయని వివరించారు.
వేర్వేరు నేరాలు..విడివిడిగానే విచారణ..
జగన్ పైన నమోదైన అభియోగాలు అన్నీ ఆర్థిక నేరాలే. పైకి ఒకే తరహాలో ఉండొచ్చు. కానీ... అవన్నీ వేర్వేరు నేరాలు. అన్నింటిపై విడివిడిగానే విచారణ జరగాలని కోరారు. 11 చార్జిషీట్లలో మొదటి నింది తునిగా జగన్, రెండో నిందితునిగా విజయసాయిరెడ్డి ఉన్నా... మిగిలిన నిందితులు వేర్వేరని వివరించారు. ఆ నేరాలకు కారణమైన జీవోలు, కేటాయింపులు చేసిన ప్రాంతాలూ వేరన్నారు. నేరాలు వేర్వేరు సందర్భాల్లో జరిగినందున ఒక్కో చార్జిషీట్పై విచారణ వేరుగానే చేపట్టాల్సి ఉందని.. ఇదే విషయాన్ని హైకోర్టు తేల్చిచెప్పిందని కోర్టు ముందు వివరించారు. బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్యాదవ్ ఉన్న సమయంలో జరిగిన దాణా స్కాం కేసుల్లో వేర్వేరుగానే విచారణ జరిగిన విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించారు.
నిందితులే బాధితులుగా..
ఈ కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి ఏడేళ్లు దాటిపోతోందని..ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ దశలోనే ఉందని వివరించారు. నిందితులు ఏదో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ విచారణను జాప్యం చేస్తున్నారని... సత్వర విచారణ పొందే హక్కును కోల్పోతూ నిందితులే బాధితులు అవుతున్నారని వివరించారు. ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, సత్వర విచారణ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ 2014లో హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లతోపాటు.... అన్ని చార్జిషీట్లలో తుది విచారణను త్వరగా పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును హైకోర్టు ధర్మాసనం ఆదేశించిందని కోర్టుకు నివేదించారు.
ఈడీదీ అదే వాదన..
కలిపి విచారణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాది కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహా పిటిషన్లను దాఖలు చేశారని, దీంతో కేసు విచారణలో జాప్యం జరిగిందని తెలిపారు. సీబీఐ, ఈడీ వాదనల నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాదుల ప్రతివాదనల కోసం తదుపరి విచారణను న్యాయమూర్తి 29కి వాయిదా వేశారు. అయితే, జగన్ కోర్టుకు గైర్హాజరీకి అనుమతి కోరుతూ సీఎం తరపు న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా..అంగీకరించిన న్యాయమూర్తి కేసును వాయిదా వేసారు.