నిమ్మగడ్డ లేఖ వివాదంపై కేంద్రం తేల్చేసింది: అందుకే భద్రత కల్పించాం : ఇప్పుడు జగన్ నిర్ణయమేంటి...!
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారని..అందులో ఏపీ ప్రభుత్వ పైన తీవ్ర ఆరోపణలు చేసారంటూ బుధవారం సాయంత్రం నుండి ఒక లేఖ వైరల్ అయింది. అయితే, రాత్రి పొద్దు పోయిన తరువాత నిమ్మగడ్డ తాను ఎటువంటి లేఖ రాయలేదని స్పష్టత ఇచ్చినట్లు ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇదే సమయంలో ఇది టీడీపీ కుట్ర ని..టీడీపీ కార్యాలయం నుండి వారికి మద్దతుగా నిలిచే ఛానళ్లుకు ఈ లేఖలు వెళ్లాయ నేది వైసీపీ ఆరోపణ. ఇదే తరహాలో వైసీపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ లేఖ ముఖ్యమంత్రి..ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించినదని..దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఎక్కడ నుండి బయటకు వచ్చిందో విచారించాలని కోరారు. అయితే, ఇదే సమయంలో నిమ్మగడ్డ రాసిన లేఖ తమకు అందిందని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది.
నిమ్మగడ్డ లేఖ అందిందని ధృవీకరిస్తూ...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా..సుప్రీం తీర్పు తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ వైరల్ అయింది. అందులో తనకు రక్షణ కల్పించాలని కోరటం తో పాటుగా ఏపీలో ప్రభుత్వ తీరు మీద ఫిర్యాదులు చేసినట్లుగా లేఖలో పలు అంశాలు ఉన్నాయి. దీంతో..ఇది సంచలనంగా మారింది. అయితే, దీని పైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుండే బయటకు వచ్చిందని ఆరోపించారు. అదే సమయంలో నిమ్మగడ్డ మెయిల్ నుండే కేంద్ర హోం శాఖకు లేఖ చేరిందని కొందరు నేతలు చెప్పుకొచ్చారు. దీని పైన వైసీపీ నేతలు డీజీపీని కలిసి వాస్తవం ఏంటో విచారించాలని కోరారు. ఇది ఇలా కొనసాగుతున్న సమయంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందిందని స్పష్టం చేసారు. ఆ లేఖ ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా గుర్తించామని తేల్చి చెప్పారు.
కేంద్రం సూచనల మేరకే భద్రత.
అసలు ఈ లేఖ తాను రాయలేదని ఎన్నికల కమిషనర్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ధృవీకరించింది. అయితే, ఈ లేఖ ఎవరి ద్వారా బయటకు వచ్చిందనే దాని పైన వైసీపీ ..టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న మీడియా సంస్థల ప్రతినిధులను విచారించాలని వైసీపీ నేతలు డీజీపీని కోరారు. ముఖ్యమంత్రి వద్ద సైతం డీజీపీ..నిఘా చీఫ్ ఈ అంశం పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, తనకు రక్షణ కావాలని నిమ్మగడ్డ లేఖ రాసినట్లుగా ప్రచారం సాగటం..దీని పైన భిన్న కోణాలు చర్చకు వచ్చిన సమయంలోనే కేంద్ర బలగాలతో ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటుగా.. నిమ్మగడ్డ నివాసం వద్ద భద్రత కల్పించారు. అయితే, తమ ప్రభుత్వం ఆ లేఖ ఎవరు రాసారనేది విచారణలో ఉన్నా..సుమోటోగా భద్రత కల్పించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, కేంద్రం సూచనల మేరకే భద్రత ఏర్పాటు చేసారి మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. భద్రత కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినా.. అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.
Recommended Video
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది...
ఇక, వివాదాస్పదంగా మారిన లేఖ ఎన్నికల కమిషనరే రాసారని..అది కేంద్ర హోం శాఖ కార్యదర్శికి చేరిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రే స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో కేంద్రం సూచనల మేరకే భద్రత కల్పించారని తేల్చి చెప్పారు. అయితే, ఇప్పటి వరకు ఈ లేఖ పైన సాగిన సస్పెన్స్ కిషన్ రెడ్డి వివరణతో క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా ఉన్నాయనేది ప్రభుత్వంలోని ముఖ్యల వాదన. టీడీపీ చేస్తున్న ఆరోపణలనే ఆ లేఖలో ప్రస్తావించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల కమిషనర్ హోదాలోనే ఆ లేఖ రాసినట్లు గా తెలుస్తుండటంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ సమయంలో ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఆయనే లేఖ రాసినట్లు రుజువైతే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటా మని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పటికే ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం గా వివాదం నెలకొన్న పరిస్థితుల్లో ఈ లేఖ వ్యవహారం పైన ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారుతోంది.