రుణాలివ్వకపోతే బ్యాంకుల ముందు చెత్త వేస్తారా ? బుగ్గనకు నిర్మల చీవాట్లు...
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు రుణాలు మంజూరు చేయలేదనే కారణంతో కృష్ణాజిల్లాలో బ్యాంకుల బ్రాంచ్ల ముందు అధికార పార్టీ నేతలు చెత్త వేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా కేంద్రం కూడా సీరియస్ అయింది. రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు చెత్త వేయిస్తారా అంటూ రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు ఫోన్ చేసి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. దీంతో వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన నిర్మలమ్మకు హామీ ఇచ్చారు.
రుణాలివ్వని బ్యాంకుల ముందు చెత్త డంపింగ్
ఏపీలోని కృష్ణా జిల్లాలో జగనన్న తోడుతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదనే కారణంతో అదికార పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. రుణాలివ్వని బ్యాంకుల ముందు స్ధానిక మున్సిపల్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి యూనియన్ బ్యాంకుతో పాటు పలు బ్యాంకు బ్రాంచ్ల ముందు చెత్తను డంపింగ్ చేయించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలియగానే కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వ్యవస్ధలు కావడంతో ఇది కాస్తా కేంద్రం దృష్టికి కూడా వెళ్లింది.
బుగ్గనకు ఫోన్ చేసి నిర్మల చీవాట్లు...
కృష్ణాజిల్లాలో రుణాలివ్వని బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ చేయించిన ఘటనపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు ఆమె ఫోన్ చేశారు. కస్టమర్లు, సిబ్బందికి ఇబ్బంది కలిగించేలా ఈ పనులేంటని ఆమె చీవాట్లు పెట్టారు. దీంతో బ్యాంకుల ముందు చెత్తను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమెకు బదులిచ్చారు. ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Recommended Video
నిర్మల ట్వీట్తో సర్కారు పరువు బజారుపాలు
కృష్ణాజిల్లాలో బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ చేసిన ఘటనపై ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో మాట్లాడానని, ఆయన తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీలో రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేశారన్న వార్త ఇప్పుడు ట్విట్టర్లోనూ వైరల్ అవుతోంది. దీంతో పాటు నిర్మల కార్యాలయం స్పందన కూడా వైరల్ అవుతోంది. అంతిమంగా ఈ చెత్త పనితో ఏపీ ప్రభుత్వ పరువు బజారున పడింది. ఎవరో కొందరు చేసిన పనికి స్వయంగా ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.