చంద్రబాబు చొప్పించిన స్లీపర్ సెల్స్.. ఎస్ఈఓ రమేష్ కుమార్ టార్గెట్ గా విజయసాయి వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటంతో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వైసీపీ ఈసీ నిర్ణయాన్ని తప్పు పడుతుంది . ఇప్పటికే ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎలక్షన్ కమీషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబు సిఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన 'స్లీపర్ సెల్స్' కరాఖండీగా చెబుతున్నాయని ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఏం తమాషానా ? రమేష్ కుమార్ నే సీఎం కుర్చీలో కూర్చోమనండి : స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు
కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే గొప్పోడు అన్నట్టు నిర్ణయం అని ఫైర్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ను టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే గొప్పోడు అంటూ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు' అంటూ ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . స్లీపర్ సెల్స్, నిద్రాణ శక్తులు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా?
ఇక మరో పోస్ట్ లో ఉగ్రవాద సంస్థలు తాము టార్గెట్ చేసిన వ్యవస్థలను విచ్ఛినం చేయడానికి మోల్స్(ద్రోహులు), కోవర్టులు, స్లీపర్ సెల్స్ను ప్రవేశపెడతాయని తాజా రాజకీయ పరిణామాలలో ఏపీలో జరుగుతున్నవి ఉగ్రవాద చర్యలని ఆయన పేర్కొన్నారు . ప్రజా సంక్షేమం కోసం కలసికట్టుగా పనిచేయాల్సిన చోట ఇలా ద్రోహులను జొప్పించడం, అదను చూసి వారు విధ్వంసానికి తెగబడటం, టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
కుల ప్రస్తావనతో పాటు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కుల పెద్దకు ‘శరణ్య'మన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి? ప్రజల చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఈ ఊడిగం చేయడమేమిటి? కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి అడ్డంగా పడుకుంటే ఆగుతుందా? అంటూ విజయసాయి రెడ్డి రమేష్ కుమార్ ను విమర్శించారు . కులపెద్దకు దాసోహం అన్నారు అంటూ కులాన్ని ఆపాదించి వ్యాఖ్యలు చేశారు.