జగన్ లా కాదు చంద్రబాబు ధర్నాలు పబ్లిసిటీ కోసమే : వైసీపీ నేతలు సజ్జల, బొత్సా ఫైర్
అనుమతి లేకుండా వెళ్లి, రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టిడిపి నేతలను బెదిరించవలసిన అవసరం తమకు లేదని, టిడిపి ఉనికి కోసం చంద్రబాబునాయుడు పాకులాడుతున్నారని, అందులో భాగంగానే ఇంత సీన్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వని కారణాలు ఇవే ... క్లారిటీ ఇచ్చిన చిత్తూరు , తిరుపతి అర్బన్ ఎస్పీలు
తిరుపతికి వెళ్లి చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ధర్నా చేయకూడదని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు .
అనుమతి లేకుండా తిరుపతికి వెళ్లి చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆందోళన చేశారని, అదే నిజమైన ధర్నా అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ధర్నాలు కేవలం పబ్లిసిటీ కోసమే అని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ.. అభ్యర్థులు దొరక్క అభాండాలు
పార్టీ గుర్తుపై పోటీ చేసే ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఓటుబ్యాంకు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకక తమపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని పేర్కొన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తన పార్టీ పరిస్థితి పై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై బొత్సా ఫైర్ .. మళ్ళీ పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్
అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యేందుకు వెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు మున్సిపల్ ఎన్నికలలో వస్తాయని, జగన్ పాలన నుంచి ప్రజలు పంచాయతీ ఎన్నికలలో 90 శాతం సీట్లు ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అని పేర్కొన్నారు. మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజం అన్న మంత్రి బొత్స సత్యనారాయణ రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ధర్నా డ్రామాపై మండిపడ్డారు.