మరో వారంలో చంద్రబాబు మాజీ .. అందుకే ఇసుక మాఫియా విజృంభణ.. విజయసాయి ఫైర్
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి రోజుకో ఇష్యూ తో టీడీపీ మీద విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మాటల దాడి చేసే విజయసాయి రెడ్డి తాజాగా ఇసుక మాఫియాపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోయాయని విజయసాయి రెడ్డి అన్నారు.
వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయిన ఘటనపై విజయసాయి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు . ఇసుక దందా నియంత్రణకై నియమించిన వీఆర్వోలపై దాడి చేసి ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ఆయన ఆన్నారు. ఈ ఘటనలో చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు, చంద్రభూషణ్కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే . చికిత్స నిమిత్తం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇసుక అక్రమరవాణాను అడ్డకోవడంతో.. వీఆర్వోలపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఇక ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఏదో ఒక విమర్శ, ఆరోపణ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఓ ట్వీట్ చేశారు. ఏపీలో ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు మాజీ సీఎం అయిపోతాడని అర్థంకావడంతో, పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. పగలూరాత్రీ లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ విషయమై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలోని ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి మాఫియాను నియంత్రించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.