సీఈసీతో చంద్రబాబు కీలక భేటీ..! రీపోలింగ్ పై అసహనం వ్యక్తం చేసిన ఏపి సీఎం..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోడాతో టీడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రీపోలింగ్కు సీఈసీ ఆదేశాల వెనుక కారణాలేంటి? రీపోలింగ్కు ఆదేశాలు ఇచ్చేముందు ఆయే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఎన్నికలు పూర్తైన చాలా రోజుల తర్వాత సీఈసీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాన్ని ఆయన లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.
ఈసి కి అన్ని రాష్ట్రాలు సమానం కాదా..! ఏపి పైన ఎందుకంత కక్ష్య సాదింపంటున్న బాబు..!!
ఇప్పటివరకు మొత్తం 6 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతి దశలోనూ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ తదితర చోట్ల చాలా ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఏపీలో వైకాపా అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులపైనే ఈసీ ఎందుకు చర్యలు తీసుకుంటోందని సీఈసీని చంద్రబాబు ప్రశ్నించే అవకాశముంది.
జాతీయ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు..! ఏక తాటిపై తీసుకురావడమే లక్ష్యం..!!
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ నెల 23 నిర్వహించతలపెట్టిన విపక్ష పార్టీల సమావేశానికి ఏయే పార్టీలకు ఆహ్వానాలు పంపాలనే అంశంపై చర్చించే అవకాశముంది. కాంగ్రెస్ అధినాయకత్వంలో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశముంది. ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఎల్జేడీ అధినేత శరద్ యాదవ్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. దిల్లీ నుంచి చంద్రబాబు లఖ్నవూ వెళ్లి మాయావతితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో విడిగా భేటీ అయ్యే అవకాశముంది. అక్కడి నుంచి లఖ్నవూ వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు భేటీ కానున్నారు.
19 చోట్ల రీపోలింగ్కు టీడిపి డిమాండ్..! కుదరదంటున్న ఈసి..!!
రాష్ట్రవ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. సచివాలయంలో మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, జవహర్, నక్కా ఆనంద్ బాబు, టీడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ విజ్ఞాపన పత్రాన్ని కూడా సీఈసీకి పంపుతూ రీపోలింగ్కు సిఫార్సు చేయాలని సీఎస్ను డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల ఫిర్యాదు పై స్పందిస్తున్న ఈసీ..! సర్వత్రా వినిపిస్తున్న అసంతృప్తి..!!
ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్ కోసం గతంలోనే ఈసీఐని కోరినట్టు మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వైసీపి చేస్తున్న ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందిస్తున్న ఈసీ.. తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు. ముందుగానే ఈసీతో మాట్లాడుకుని సీఎస్కు వైసీపి ఫిర్యాదు చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. దశలవారీగా రీపోలింగ్ జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని మంత్రి వ్యాఖ్యానించారు. తమ విజ్ఞప్తిని సైతం సీఈసీకి పంపాలని సీఎస్ను కోరినట్టు మంత్రి చెప్పారు.