మేం ఇంత చేశాం! 14 నెలల్లో మీరేం చేశారు: వైఎస్ జగన్కు చంద్రబాబు సూటి ప్రశ్నలు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని.. వైసీపీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు.
Recommended Video
ఏపీని అగ్రగామిగా నిలిపాం..
సోమవారం చంద్రబాబు నాయుడు ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానానికి తీసుకొచ్చామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిపామని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించామన్నారు.
14 నెలల్లో ఏం చేశారు?: చంద్రబాబు
సీనియర్ నాయకుడిగా ప్రజలను చైతన్యవంతులను చేయడం తన బాధ్యత అని అన్నారు చంద్రబాబు. ఇక వైఎస్ జగన్ సర్కారుపై సూటి ప్రశ్నలు సంధించారు. ఏది నిజమైన అభివృద్ధి.. ఏది నిజమైన విధ్వంసమో ప్రజలు ఆలోచించాలని అన్నారు. 13 జిల్లాలకు టీడీపీ హయాంలో మేం ఏం చేశామో చెబుతామని.. ఈ 14 నెలల్లో వైసీపీ ఏం చేసిందో చెప్పగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగువారి శ్రేయస్సు తప్ప టీడీపీకి మరో ఆలోచనే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ సర్కారు రూపాయి ఖర్చు చేయలేదు..
తాము 62 ప్రాజెక్టులకు నాంది పలికితే.. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. 17 నెలల్లో జలవనరులకు రూపాయి కూడా జగన్ సర్కారు ఖర్చు చేయలేదని అన్నారు. ఖర్చు పెట్టకపోతే పెండింగ్ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని చంద్రబాబు ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని అన్నారు. అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు.
లేనిపోని గొడవలతో ఏం సాధించారు?
విద్యుత్ కొరతను తీర్చామని, గ్రామాల్లో 25వేల కిమీ మేర సీసీ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం ఏపీనేనని చంద్రబాబు తెలిపారు. ఏపీ 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని, ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తాము రాయలసీమకు జీవనాడి లాంటి ముచ్చుమర్రిని పూర్తి చేశామన్నారు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఇవాళ ఏం సాధించారని వైసీపీని చంద్రబాబు ప్రశ్నించారు. మూతపడ్డ కడప ఎయిర్ పోర్టును ఆధునీకరించామని, తిరుపతిని హార్డ్వేర్ హబ్గా తయారు చేశామని చెప్పారు. శ్రీ సిటీకి 90 వరకు పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.