విశాఖపై ప్రేమ కాదు! ఏ2 ఇప్పటికే అక్కడి భూములపై కన్నేశాడు: రక్తం ఉడికిపోతోందంటూ..
రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపు విషయంలో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని మార్చాలని రాష్ట్రంలో ఒక్కరైనా అడిగారా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.
రాజధాని అంటే పేకాట ముక్కలా?
శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని అంటే పేకాటలో మూడు ముక్కలాట అనుకున్నారా? అని నిలదీశారు. రాజధాని అంటే ఎవరైనా గర్వంగా చెబుతారని.. మరి మనమేం చెబుతాం? అని ప్రశ్నించారు.
తొలిసారి జోలె పట్టుకున్నా.. రక్తం ఉడికిపోతోంది..
రాష్ట్ర యువత ఉపాధి కావాలని కోరుకుంటోందని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని మాత్రమే రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీవితంలో తొలిసారిగా తాను అమరావతి కోసం జోలె పట్టుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రకృతి విపత్తుులు ఎప్పుడు వచ్చినా ప్రజలు విరాళాలు ఇచ్చారని చెప్పారు. తన కోసం పోరాడటం లేదని, ప్రజల కోసమే పోరాడుతున్నానని చంద్రబాబు చెప్పారు. విశాఖతోపాటు తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ2 ఇప్పటికే విశాఖ భూములపై కన్నేశారంటూ తీవ్ర విమర్శలు..
విశాఖ జిల్లాపై మకు ప్రేమ లేదు.. అక్కడి భూములపైనే ప్రేమ అని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. విశాఖపై ప్రేమ ఉంటే ఇప్పటికే అనేక సంస్థలు తెచ్చేందుకు కృషి చేసేవారని, ఏ2 విశాఖలోనే 7 నెలలుగా ఉండి భూములపై కన్నేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. అమరావతి రైతుల పొట్ట కొట్టాలని విశాఖ వాసులు కోరుకోరని చంద్రబాబు చెప్పారు. విశాఖకు డేటా సెంటర్, లులు సంస్థను తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. హుధుద్ తుఫాను వచ్చినప్పుడు అక్కడు ఉండి ఎంతో పనిచేశామని గుర్తు చేశారు.
అమరావతి ఆమోదయోగ్యమైన రాజధాని.. ఒక్కడే ఎదుర్కొంటా..
అధికారం ఉందని ఇష్టానుసారంగా నడుచుకుంటే ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా.. తాను ఒక్కడినే ఎదుర్కొగలనని అన్నారు. అమరావతిని రియల్ ఎస్టేట్ అని ఆరోపిస్తున్నారని.. రైతుల భూముల ధరలు పెరిగితే మీకొచ్చే ఇబ్బందేంటని అధికార పార్టీ నేతనలు చంద్రబాబు ప్రశ్నించారు. రూ. కోటి విలువైన భూమిని ఈ పెద్ద మనిషి జగన్ రూ. 10 లక్షలు చేశాడని మండిపడ్డారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని.. అందరికీ ఆమోద యోగ్యమైన రాజధానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.