బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనేజ్మెంట్లో దిట్ట అనే పేరు ఉంది. దానికి తగినట్లే సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర విపక్షాలు ఊహించని విధంగా పథకాలు, రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగిందని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని విపక్షాలు మండిపడుతున్నాయి. కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు చంద్రబాబు అస్త్రాలు ప్రయోగిస్తున్నారు!
టీడీపీ ఆ వ్యూహం ఏ మేరకు పని చేస్తుందో?
ఓ విధంగా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే విపక్ష ఓటు చీలి అది టీడీపీకి లబ్ధి చేకూరుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా కాపు ఓట్లను, యువత ఓట్లను సాధించుకున్న టీడీపీ.. ఈసారి వంగవీటి రాధాకృష్ణను ఆయా ప్రాంతాల్లో ప్రచారంలో వినియోగించుకొని జనసేనాని సామాజిక వర్గం ఓట్లను దక్కించుకోవాలని చూస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అయితే పవన్ క్రేజ్, వంగవీటి క్రేజ్ వేరు. టీడీపీ అదే వ్యూహంతో ఉంటే అది ఏ మేరకు పని చేస్తుందనేది ఎన్నికల్లో తేలనుంది.
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'
మిగతా చోట్ల పవన్ కళ్యాణ్ను ఎలా ఎదుర్కోవాలి?
పవన్ కళ్యాణ్ ప్రభావం కొన్ని జిల్లాల్లోనే ఉంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సామాజికవర్గం ఉన్నచోట వంగవీటి రాధాకృష్ణతో విస్తృతంగా ప్రచారం చేయించాలని చూస్తున్నారట. మిగతా చోట్ల పవన్ కళ్యాణ్ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అంతర్గతంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి జనసేనాని విషయంలో టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఆయనను ఏమీ అనకపోవడం కూడా వ్యూహంలో భాగమేనని, ఒకటి ఆయన తమ వైపు ఉన్నారనే సంకేతాలు పంపించడంతో పాటు, జనసేనాని పట్ల టీడీపీ సానుకూలంగా ఉందనే అభిప్రాయాన్ని కల్పించడం కోసం కావొచ్చునని చెబుతున్నారు. మరోవైపు, అగ్రవర్ణాలకు ఇస్తున్న పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇవ్వాలని కూడా చంద్రబాబు చూస్తున్నారు. ఇది కాపులను తమ వైపుకు రప్పిస్తుందని భావిస్తున్నారు.
జగన్కు నవరత్నాల చెక్
ఇక, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలోని పథకాలలో కొన్నింటిని అప్పుడే ప్రకటించి అమలు చేసేందుకు సిద్ధమయ్యారని, దీంతో జగన్కు చెక్ చెబుతున్నారని అంటున్నారు. జగన్ పథకాలు బాగున్నప్పటికీ.. అధికారంలోకి ఆయన వచ్చాక అమలు చేసేబదులు.. ఇప్పుడే వాటిని అందుపుచ్చుకొని టీడీపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఇప్పటిక ఆరోపిస్తోంది. జగన్ను కార్నర్ చేసేందుకు టీడీపీ నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ను లాగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఆయన ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని చెప్పడం, జగన్, కేటీఆర్ భేటీ కావడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పైన సాఫ్ట్, జగన్ పైన హార్డ్ అస్త్రాలు తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
జగన్ పథకాలు.. చంద్రబాబు అమలు... వైసీపీలో గుబులు
జగన్ ప్రకటించిన పలు పథకాలను చంద్రబాబు ఇప్పుడే అమలు చేస్తుండటం వైసీపీకి గుబులు పుట్టిస్తోందట. తమ పథకాలను టీడీపీ కార్నర్ చేసి, అప్పుడే అమలు చేస్తే తమకంటే టీడీపీకే లబ్ధి అని ఆందోళన చెందుతున్నారట. అందుకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే ఓ ఉదాహరణ అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పథకాలనే కేసీఆర్ కాపీ కొట్టారని, అప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మేనిఫెస్టోనే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లిందని గుర్తు చేస్తున్నారు. రైతులకు పంట పెట్టుబెడి, పింఛన్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు జగన్ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు టీడీపీ అమలు చేస్తే అది అధికార పార్టీకి లబ్ధి అవుతుందని భావిస్తున్నారట.