వేలంపాటల్లో కొత్త థియరీ: చంద్రబాబుకు నోబెల్ కమిటీ అన్యాయం చేసిందంటోన్న విజయసాయి రెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోబెల్ ప్రైజ్ కమిటీ తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సెటైర్లు సంధించారు. వేలంపాటల్లో సరికొత్త థియరీని ఎప్పుడో కనుగొన్న చంద్రబాబును కాదని.. వేరెవరికో ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డులను ఇవ్వడం సరికాదని చెప్పారు. చంద్రబాబు ప్రతిభను నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రతినిధులు ఇప్పటికైనా గుర్తించాలని, ఆయన పేరుతో అవార్డుల జాబితాలో చేర్చాలనీ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులు అమెరికన్లను వరించిన విషయం తెలిసిందే. ఆర్థికశాస్త్రంలో నూతన ఆక్షన్ విధానాన్ని కనిపెట్టిన స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్కు నోబెల్ ప్రైజులను ప్రకటించింది కమిటీ. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆక్షన్ థియరీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మట్స్ను ఆ ఇద్దరు ప్రొఫెసర్లు కనిపెట్టారు. దీనివల్ల ఆర్థికశాస్త్రంలో ఓ వినూత్న ప్రక్రియకు తెర తీసినట్టవుతుందని కమిటీ నిర్ధారించింది.
ఈ అంశాన్ని విజయసాయి రెడ్డి.. సెటైరికల్గా మలిచారు. చంద్రబాబుపై ప్రయోగించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న సందర్భానికి ముడిపెట్టారు. వేలంపాటల్లో కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్న చంద్రబాబును కాదని ఎవరికో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం సరి కాదని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు ఎప్పుడో తన జమానాలోనే సరికొత్త వేలంపాటల విధానాన్ని కనుగొన్నారని చురకలు అంటించారు.
Recommended Video
చంద్రబాబు ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టిన విషయం నోబెల్ బహుమతుల ఎంపిక కమిటీ దృష్టికి చేరలేదని అన్నారు. ఇప్పటికైనా నోబెల్ కమిటీ ప్రతినిధులు.. చంద్రబాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పేరును నోబెల్ అవార్డుల కోసం ఎంపికైన వారి జాబితాలో చేర్చాలంటూ వ్యంగ్యస్త్రాలను సంధించారు. తనకు అవసరం లేకపోయినప్పటికీ.. ప్రతిపక్షాన్ని బలహీనపర్చడానికి చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను వేలంపాటల రూపంలో కొనుగోలు చేశారని విమర్శించారు. 23 మంది ఎమ్మల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారని గుర్తు చేశారు.