ఈ ప్రభుత్వానికి పిచ్చి..రాష్ట్రానికి పట్టిన శని : కేంద్రం చెప్పినా అర్దం కాలేదా : చంద్రబాబు ఫైర్..!!
పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పైన హైకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. దీని పైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాము ముందు నుండి చెబుతున్నదే జరిగిందన్నారు. జగన్ మూర్ఖంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఇప్పుడు కోర్టు తీరపు పైన ప్రభుత్వం ఏం చెబుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వంలోని లేని అవినీతి మరక ను తమకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, టీడీపీ నేతలు సైతం కోర్టు తీర్పు పైన స్పందించారు. 2009లో నాడు వైయస్సార్ ఏం చేసారో..ఇప్పుడు 2019 లో జగన్ అదే చేసారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఈ తీర్పు ప్రాజెక్టు మీద ప్రభావం చూపుతుందని చంద్రబాబు అంచనా వేసారు. టీడీపీ నేతలు వరుసగా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు.
ఈ ప్రభుత్వానికి పిచ్చి..రాష్ట్రానికి పట్టిన శని..
నవయుగ ను పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనుల నుండి తప్పించటం పైన ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ జెన్ కో ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీని పైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కోర్టు తీర్పు పైన ప్రభుత్వం ఏం చెబుతోందని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. పోలవరం విషయంలో ప్రయోగాలు వద్దని చెప్పినా..లేని అవినీతి నిరూపించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా.. లేక రాష్ట్రానికి పట్టిన శని గా అనుకోవాలా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం చెబుతున్న జగన్ కు అర్దం కావటం లేదా అని సీరియస్ అయ్యారు. గతంలో కేంద్ర మంత్రి గడ్కరీ సైతం పోలవరం కాంట్రాక్టు రద్దు చేయవద్దని.. కోర్టులకు వెళ్లితే మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణమే ఆగిపోతుందని చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. ఇప్పుడు అదే జరుగుతోందని..పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు సైతం ఆలస్యం జరుగుతుందని అందోళన వ్యక్తం చేసారు.
నాడు వైయస్సార్..నేడు జగన్
చంద్రబాబుతో పాటుగా టీడీపీ నేతలు సైతం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. నాడు 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్సార్ సైతం ఇదే రకంగా వ్యవహరించారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అప్పట్లో జగన్ తనకు పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు కావాలని ఒత్తిడి చేసారని..అది సాధ్యం కాకపోవటంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారని విమర్శించారు. సరిగ్గా నాడు వైయస్సార్ ఏ రకంగా చేసారో..ఇప్పుడు జగన్ సైతం అదే చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రాజెక్టు పనులు ఏపీ జెన్ కో నవయుగకు అప్పగించి..మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తే ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఉమ వివరించారు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ చెప్పిన అంశాలను పట్టుకొని మొత్తంగా ప్రాజెక్టు నిలిపివేసే పరిస్థితి తీసుకొచ్చారంటూ ఉమా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తన అనుయాయులకు ప్రాజెక్టు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైనా..ఆగిపోయినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాడు చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తే..నేడు జగన్ స్వార్ధంతో పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
రివర్స్ టెండరింగ్ సరికాదంటున్నా...
పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ సరి కాదని చెబుతున్నా..ముఖ్యమంత్రి జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో లేని అవినీతిని నిరూపించాలనే ఉద్దేశంతో జగన్ ముందుకు వెళ్తున్నారని..ఈ నిర్ణయాలు మొత్తంగా నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కోర్టు తీర్పుతో అయినా ముఖ్యమంత్రి తన ఆలోచన తీరు మార్చుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా సూచించారు. పోలవరం..రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాలని ముక్యమంత్రిని డిమాండ్ చేసారు.