తరగతి గదిలోతాగి వీరంగం వేసిన బాలికల వ్యవహారం పై బాలల హక్కుల కమీషన్ సీరియస్ .. బాలికలకు కౌన్సిలింగ్
తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్ దృష్టిసారించింది. పాఠశాల హెడ్మాస్టర్ పై సీరియస్ అయింది. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ లేకుంటేనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసిన విద్యార్థినులను బాలల సదన్ కు పంపించి పదిహేను రోజులపాటు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. పెడదారిన పట్టిన విద్యార్థినులను మార్చడానికి ప్రయత్నం చేయకపోగా టీసీ ఇచ్చి పంపించడంపై అగ్గి మీద గుగ్గిలమైంది బాలల హక్కుల కమిషన్.
బాలికలు తాగి వీరంగం వేసిన ఘటనపై బాలల హక్కుల కమిషన్ విచారణ
తరగతి గదిలో బాలికలు మద్యం తాగిన ఘటన పై విచారణ చేపట్టిన బాలల హక్కుల కమీషన్ చైర్పర్సన్ హైమావతి ఉపాధ్యాయుల పై మండి పడ్డారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచారణ చేపట్టిన బాలల హక్కుల కమిషన్ ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకుంది.తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తరగతి గదిలో మద్యం సేవించడం స్థానికంగా కలకలం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్ పర్సన్ హైమావతి , కమీషన్ సభ్యులు, చైల్డ్ లైన్ సభ్యులు పాఠశాల హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ తో పాటు 50 మంది ఉపాధ్యాయ బృందాన్ని పిలిచి విచారణ చేశారు. తరగతి గదిలో ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిరంతర పర్యవేక్షణ కొరవడితేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ సీరియస్ అయ్యారు. గతంలో కూడా పాఠశాలలో ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని మండిపాటు కు గురయ్యారు.
టీసీలిచ్చి పంపడంపై బాలల హక్కుల కమిషన్ ఫైర్ ... టీచర్లకు క్లాస్
బాలికలను మార్చాల్సింది పోయి వారికి టీసీలు ఇచ్చి పంపడం ఉపాధ్యాయులు చేయదగిన పని కాదంటూ మండిపడ్డారు. విద్యార్థులను సక్రమమైన బాటలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనిస్తే వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల కమిషన్ ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థినులను పదిహేను రోజులపాటు బాలల సదన్ కు పంపించి కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని, పాఠశాలలకు రాని విద్యార్థుల పై తల్లిదండ్రులకు తెలియజేయాలని, అవసరమనుకుంటే వారి ఇళ్లకు వెళ్లి మరీ కౌన్సిలింగ్ ఇవ్వాలని బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉపాధ్యాయులకు సూచించారు. వారానికి ఒకసారి సైకాలజిస్ట్ తో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ హైమావతి అభిప్రాయపడ్డారు. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఫిర్యాదుల బాక్సులను ఉంచాలని సూచించారు. ఇక పాఠశాలల బయట ఆకతాయి ముఠాలపై పోలీసుల దృష్టి సారించాలని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె పోలీసు శాఖకు సూచనలు చేశారు.
విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఉపాధ్యాయులు
విచారణలో భాగంగా ఉపాధ్యాయులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బయట వ్యక్తుల ప్రమేయంతోనే విద్యార్థులు పెడదారి పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో పాఠశాల లేని సమయంలో పాఠశాల భవనం పైకి ఎక్కి మద్యం సేవిస్తున్నారని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. పాఠశాల గేటు వద్ద కాపుకాసి విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న పరిస్థితులను వివరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఉపాధ్యాయులు బాలల హక్కుల కమిషన్ కు వివరణ ఇచ్చారు.
బాలికలు తరగతి గదిలోనే తాగిన ఘటనతో అలర్ట్ అయిన విద్యాశాఖ
విజయవాడ నగర శివారులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగి హల్చల్ చేసిన ఇద్దరు విద్యార్థినులను వారం రోజులపాటు ఐ సి డి ఎస్ అధికారులసమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించే ఏర్పాట్లు చేసినట్లుగా డీఈవో రాజ్యలక్ష్మి వివరించారు. 9వ తరగతి బాలికలు తాగి పాఠశాలకు రావడం విద్యా శాఖలో కలకలం రేపిన నేపథ్యంలో అప్రమత్తమైన విద్యాశాఖ విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కౌన్సిలింగ్ ఒకటే మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరి అని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు.