మెగాస్టార్ చూపు కమలం వైపు..! కొద్ది రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న సై రా నర్సింహారెడ్డి..!!?
Recommended Video
హైదరాబాద్ : 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న చిరంజీవి మరో సారి రాజకీయ వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమైన చిరంజీవి సినిమాల మీద దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా చిరంజీవిని కాంగ్రెస్ అదిష్టానం ఎంపిక చేసినా ప్రచారంలో పెద్దగా పాల్గొన లేదు. సినిమాల పేరుతో అప్పుడు రాజకీయాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. తర్వాత జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పెద్దగా చేసిందేమీ లేదనే ప్రచారం జరిగింది. తాజాగా చిరంజీవి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి చిరు..! సైరా షూటింగ్ తర్వాత కీలక నిర్ణయం.!!
ఏదైనా వేడిలో వేడిగా చేస్తే ఓ పనైపోతుంది అంటారు పెద్దలు. సక్సెస్ హాంగోవర్ లో బీజేపి దక్షిణ భారతంలో బలోపేతానికి అడుగులు వేస్తోంది. సౌత్ ఇండియాలో ప్రభావం చాటుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలను బీజేపి ఆయుధాలుగా వాడుకుంటున్న విషయం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా ఇటు తెలంగాణలో, అటు ఏపిలో పాగా వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపి. ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నాల్లో భాగంగా బిజెపి కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ బలాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన బిజెపి అధిష్టానం రాష్ట్రంలో పాగా వేయడానికి గాను సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను బిజెపిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీ నేతలు వ్యూహాలు సిద్దం చేశారు.
అందరివాడుకి గాలం వేస్తున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే కమలం టార్గెట్..!!
అందులో భాగంగానే తెలుగుదేశం ఎంపీలు నలుగురు ఇటీవల బిజెపి కండువా కప్పుకున్నారు. సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఇప్పటికే బిజెపిలో చేరిన వారిలో ఉన్నారు. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో కొంత మంది కీలక నేతలు పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పార్టీ మారడానికి సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే రాయలసీమకు చెందిన పెద్ద కుటుంబాలని సైతం పార్టీ మార్చటానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒక్క టీడిపి నుండి కాకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలను బీజేపిలో చేర్చుకునేందుకు బీజేపి పావులు కదుపుతోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఛరిష్మా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలో కలుపుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది బీజేపి.
కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయనున్న మెగాస్టార్..! పావులు కదుపుతున్న అమీత్ షా..!!
ఇదే పరంపరలో బీజేపి పెద్దలు మెగాస్తార్ తో మంతనాలు జరిపినట్టు తెలుప్తోంది. అంతే కాకుండా ఏపిలో ఇప్పటికే బిజెపి నేతలు మిగిలిన కాంగ్రెస్ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయని కొంత బీజేపి నేతలు చెప్పుకొస్తున్నారు. చిరంజీవితో సోమవారం రాత్రి బిజెపి కాపు సామాజిక వర్గ నేతలు భేటి అయినట్టు విశ్వసనీయత సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్లో పార్టీలో ఉన్నా సరే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కి ప్రచారం చేయలేదు.
అన్నయ్య తో టచ్ లో ఉన్న ఏపి బీజేపి నేతలు..! మరి కొద్ది రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న తెలుగు స్టాలిన్..!!
ఏప్రిల్ 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఇక గత కొంత కాలంగా సినిమాల మీద దృష్టి సారించిన ఆయన ప్రస్తుతం "సైరా నరసింహారెడ్డి" చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయన అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా బిజెపి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి బీజేపిలోకి వెళ్తే తెలుగురాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గం పైన ప్రభావం ఉంటుందనే చర్చ జరగుతోంది.