మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల వరద- కృష్ణా, గుంటూరు అప్రమత్తం...
తాడేపల్లి: కృష్ణానదిలోకి ఇవాళ మధ్యాహ్నానికి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ జలవనరులశాఖ, రెవన్యూ అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
Recommended Video
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడనుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు కృష్ణానదిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో అధికారులు పలుమార్లు పర్యటించి వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగాఉండాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.