వంశీ రాజీనామాపై సీఎం తేల్చేసారు: వెంకటరావుకు జగన్ ఇచ్చిన హామీ అదే : అసెంబ్లీలో ఆయన ఇలాగే..!
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వల్లభనేని వంశీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చేసారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు..గన్నవరం నుండి తాజా ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావును ముఖ్యమంత్రి తన వద్దకు పిలిపించుకున్నారు. కొద్ది రోజులుగా వంశీ వైసీపీలోకి వస్తారనే అంశం మీద వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారమూ సాగింది. ఇదే సమయంలో వంశీ పార్టీలో ఎప్పుడు చేరాలి..ఎలా చేరాలనే అంశం మీద డైలమా సాగుతోంది. దీంతో..వంశీకి పార్టీలో ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తూ..అే సమయంలో వెంకటరావుకు ముఖ్యమంత్రి నుండి రాజకీయ భవిష్యత్ పైన స్పష్టమైన హామీ లభించింది . ఇదే సమావేశంలో వంశీ ఎప్పుడు రాజీనామా చేయాలనే అంశం మీద క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
అగ్గి రాజేసిన వల్లభనేని! ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన కృష్ణా జిల్లా రాజకీయాలు!
ముఖ్యమంత్రితో వెంకటరావు భేటీ..
గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి..ఇప్పుడు వైసీపీలో చేరేందుకు వల్లభనేని వంశీ సిద్దమయ్యారు. అయితే, వంశీ పైన వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంటకరావు ఈ వ్యవహారం పైన అసహనంతో ఉన్నారు. ఆయన అనుచరులు..వంశీ పార్టీలో రాక పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో..ముఖ్యమంత్రి జగన్ జిల్లా మంత్రులకు తన వద్దకు వెంకటరావును తీసుకురావాలని సూచించడంతో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని ముఖ్యమంత్రి వద్దకు వెంకటరావును తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి వద్ద వెంకటరావు రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ లభించిందని, జగన్ స్వయంగా హామీ ఇవ్వటంతో వెంకటరావు సైతం అంగీకరించినట్లుగా సమాచారం. అదే సమయంలో ముఖ్యమంత్రి గన్నవరం రాజకీయ వ్యవహారాల పైన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, మొత్తం వ్యవహారం ఇద్దరు మంత్రులు చూసుకుంటారని చెప్పినట్లుగా సమాచారం.
వంశీ రాక ఖాయం..వెంకటరావుకు ఆ పదవి..
ముఖ్యమంత్రితో భేటీ సమయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఇప్పటికే బహిరంగంగా తాను వైసీపీలో చేరుతానని చెప్పిన విషయం పైన చర్చ జరిగింది. మంత్రులిద్దరూ వంశీ ప్రకటనను ప్రస్తావిస్తూ.. ఆయన టీడీపీని కాదని..ఎమ్మెల్యే పదవి సైతం వద్దని మన వద్దకు వస్తుంటే..అడ్డుపడటం సరి కాదని మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీని ద్వారా వంశీని అధికారికంగా త్వరలోనే వైసీపీలో చేర్చొకొనే విధంగా సీఎంతో సహా మంత్రులు సైతం సంకేతిలిచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వెంకటరావుకు నచ్చ చెప్పారని, వంశీ పార్టీలో చేరినా..వెంకటరావు రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని వైసీపీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. త్వరలోనే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో..వెంకటరావు సైతం సంతోషం వ్యక్తం చేసారని అంతర్గత సమాచారం. దీంతో..ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ద్వారా అటు వల్లభేని వంశీ వైసీపీలో ఎంట్రీ..యార్లగడ్డ వెంటకరావుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమయ్యాయనే వార్త ప్రచారంలో ఉంది.
సీఎం సూచనల మేరకు నడుచుకుంటా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పినట్లే నడుచుకుంటానని.. పార్టీని బలోపేతం చేస్తానని గన్నవరం వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. వంశీతో నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని, నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని వెంకట్రావుకు జగన్ సూచించినట్టు తెలిసింది.వెంకట్రావు రాజకీయ భవిష్యత్ విషయం తాను చూసు కుంటానని జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంకట్రావు వంటి వారు పార్టీకి అండగా ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం పార్టీ బాధ్యతని సీఎం జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎం జగన్ హామీతో వెంకట్రావు వర్గంలో సంతోషం వ్యక్తమవు తోంది. సీఎంతో భేటీ అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెంకట్రావు ఒకే కారులో వెనుదిరిగారు.
Recommended Video
వంశీ రాజీనామా ముహూర్తం అప్పుడే..
అదే సమావేశంలో వంశీ టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతనే అధికారికంగా వైసీపీలో చేరుతారని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వంశీ స్వతంత్రంగా ఒక్కరే కూర్చుకుంటారని.. శాసనసభా సమావేశాల అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై నిర్ణయం తీసుకుంటారని ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు.. వంశీ రాజకీయంగా అడుగులు వేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్తో వెంకట్రావు భేటీతో.. వంశీ మోహన్ అంకానికి తెరపడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీ కోసం పని చేయనుండగా..టీడీపీ కొత్త ఇన్ ఛార్జ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.