సభలో సున్నావడ్డీ రచ్చ: జగన్ సవాల్..చంద్రబాబు సీరియస్: నాటి ఘటనకు నేడు సీఎం ఇలా..!
ఏపీ శాసనసభా సమావేశాల్లో అధికార - ప్రతిపక్షాల మధ్య హోరా హోరీ మాటల యుద్దం నడుస్తోది. కరువు పైన సీఎం జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని పైన చర్చ సమయంలో టీడీపీ నుండి మాట్లాడిన రామానాయుడు సున్నా వడ్డీ జగన గొప్పదనం కాదని..తాము అమలు చేసామని చెప్పటంతో సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు హాయంలో ఇవ్వలే దని..ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పాలని నిలదీసారు. దీని పైన టీడీపీ ఆత్మరక్షణలో పడింది. తరువాత జగన్ దీని పైనే చంద్రబాబుకు సవాల్ చేసారు. ప్రతిపక్ష నేత ఆవేశంతో ఊగిపోయారు. దీంతో..లెక్కలు తెప్పించిన జగన్ వివరాలను సభ ముందుంచారు. ఈ ఘటన చూస్తే..నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ను మంత్రుల పైన చేసిన అభియోగాల విషయంలో ఎలా ఇబ్బంది పెట్టారో..అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది.
సభలో సున్నా వడ్డీ పైన చర్చ..
ఏపీ శాసనసభలో వైసీపీ..టీడీపీ మధ్య వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కరువు మీద తన స్టేట్మెంట్లో రైతులకు సున్నా వడ్డీ పధకం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ నుండి మాట్లాడిన రామానాయుడు తన ప్రసంగంలో సున్నా వడ్డీ తానే తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని.. ఇది 2014 నుండి అమల్లో ఉందని..కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తే..చంద్రబాబు సైతం కొనసాగించారని చెప్పుకొచ్చారు. దీని పైన సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ అమలు చేయలేదని..చేసామని చెబుతున్న టీడీపీ నేత అది తప్పని నిరూపిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం స్పందించారు. రికార్డులు మీ వద్దే ఉన్నాయి..మీరే చూసుకోవాలని చెప్పారు. సీఎం జగన్ సున్నా వడ్డీ ఇచ్చారా లేదా అని చెప్పాలని..ఇవ్వలేదని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇదే అంశం మీద సవాల్ చేస్తున్నాననంటూ సీరియస్ అయ్యారు.
చంద్రబాబు సీరియస్..మీ చరిత్ర ఎవరికి తెలియదు..
ముఖ్యమంత్రి జగన్ చేసిన సవాల్ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆవేశంగా మాట్లాడారు. ఎవరు అధికారంలో ఉంటే వారి పాలసీలు అమలవుతాయని దీని గురించి చర్చ ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభలో ప్రయోగిస్తున్న భాష సరిగ్గా లేదని..మీ చరిత్ర ఎవరికి తెలియదని ఫైర్ అయ్యారు. మీరు ఎగతాళి చేస్తారా..వయసుకు గౌరవం ఇవ్వారా అని నిలదీసారు. గాడిదలు కాసే వాళ్లలాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. మీరు ఏది మాట్లాడినా పడాలా అంటూ ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మరోసారి ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన లెక్కలు వివరించారు. దీంతో..జగన్ రికార్డులు తెప్పించారు. రూపాయి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తాము సున్నా వడ్డీ కింద అయిదేళ్లలో 15వేల కోట్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తే అసలు టీడీపీ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేయలేదనే విషయం గుర్తించాలని సూచించారు.
నాటి ఘటన సభలో రిపీట్..
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సభలో ఆనాడు రాజధాని భూముల విషయంలో మంత్రులు నారాయాణ..ప్రత్తిపాటి పుల్లారావు మీద జగన్ ఆరోపణలు చేసారు. వారు ముందస్తు సమాచారంతో అక్కడ బినామీ పేర్లతో భూములు కొన్నారని జగన్ ఆరోపించారు. దీంతో..ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలు వెంటనే నిరూపించాలన..ఆ తరువాతనే సభలో మాట్లాడాలంటూ దాదాపు అరగంటకు పైగా చంద్రబాబు సభను అడ్డుకున్నారు. జగన్ ఆధారాలు నిరూపిస్తే తాను ఆ ఇద్దరి మంత్రుల పైన ఇప్పుడే వేటు వేస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే, జగన్ అసలు దోషియే చంద్రబాబు అయితే, మీకు ఆధారాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించటంతో చర్చ పక్కదోవ పట్టింది. ఇప్పుడు సైతం..ముఖ్యమంత్రి హోదాలో జగన్ అదే విధంగా చంద్రబాబును నేడు ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారంటూ వైసీపీ నేతలు నాటి ఘటన గుర్తు చేస్తున్నారు.