నాడు జగన్తో దురుసుగా..నేడు బదిలీ: ఏ ఒక్కరినీ వదలని ముఖ్యమంత్రి: తాజా నిర్ణయాల వెనుక..!
ముఖ్యమంత్రి జగన్ ఏ ఒక్కరినీ వదలటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలకుల కోసమే అన్నట్లుగా పని చేసిన అధికారులను ఒక్కొక్కరినీ కీలక విభాగాల నుండి సాగనంపుతున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోకే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరినీ ఒకే సారి కాకుండా దశల వారీగా తన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ను కొనసాగించటంతో పాటుగా..డీజీపీ మార్పు..అదే విధంగా ఈ మధ్య కాలంలో తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక ఒక్కో కారణం ఉంది.
నాడు జగన్తో దురుసగా అహ్మద్ బాబు..
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణీకులు మరణించారు. మరి కొంత మంది గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించిన జగన్ ఆ తరువాత ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించటానికి వెళ్లారు. అక్కడ జగన్ వెళ్లిన సమయంలో ప్రభుత్వ సూచనల మేరకు నాడు జిల్లా కలెక్టర్గా ఉన్న ఏ బాబు సైతం వచ్చారు. జగన్ మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తుండగా..వాటిని ఆయన దురుసుగా లాగేసుకున్నారు. ఆ సమయంలో స్వల్ప వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఇక..టీడీపీ నేతలు జగన్ అధికారుల పైన దౌర్జన్యం చేసారంటూ విమర్శ లను ప్రారంభించారు. జేసీ ప్రభాకర్రెడ్డి సైతం జగన్ను వ్యక్తిగత దూషణలకు దిగింది ఈ ప్రమాదం పైన జగన్ విచారణకు డిమాండ్ చేసిన సమయంలోనే. ఇక, ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో చంద్రబాబును ఈ అధికారే తప్పు దోవ పట్టించారనే కోపం టీడీపీ నేతల్లోనూ ఉంది .ఇప్పుడు జగన్ ఆదేశాల మేరకు ఆయన్ను బదిలీ చేసారు.
డీజీపీతో మొదలు పెట్టిన జగన్..
ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు చేపట్టక ముందే డీజీపీ మార్పు పైన జగన్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హాయంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ఆనాటి డీజీపీ..ఇంటలిజెన్స్ చీఫ్ పూర్తిగా అనుకూలంగా వ్యవహరించటం తన విషయంలో ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించటంతో జగన్ ముందుగా వారి మీద ఫోకస్ చేసారు. డీజీపీని మార్చి ఆయన స్థానంలో గౌతం సవాంగ్ను నియమించారు. అదే విధంగా ఇంటలిజెన్స్ చీఫ్ను బదిలీ చేసి పోస్టింగ్ సైతం ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రను నియమించాలని జగన్ నిర్ణయించారు. అదే విధంగా టీడీపీ అనుకూల అధికారులుగా పేరున్న ఘట్టమనేని శ్రీనివాస్, కోయ ప్రవీణ్ లాంటి వారిని బదిలీ చేసారు. పదవీ విరమణ చేసి ఓఎస్డీగా కొనసాగుతున్న యోగానంద్ సైతం రాజీనామా చేసారు. ఇక, పూర్తిగా పోలీసు శాఖ బాధ్యతలను డీజీపీ.. స్టీఫెన్ రవీంద్ర కే అప్పగించారు. పోలీసింగ్లోనూ జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు.
ఐఏయస్ల విషయంలోనూ ఇలాగే..
ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను జగన్ కొనసాగించారు. అదే విధంగా తన కార్యాలయం లో సీనియర్ అధికారులకు అవకాశం ఇచ్చారు. విద్య..వైద్యం..ఇరిగేషన్.. ఆర్దిక..రెవిన్యూ విభాగాల్లో కీలక అధికారులను ఎంపిక చేసుకున్నారు. కృష్ణబాబు..పీవీ రమేష్ లాంటి వారిని కేంద్ర సర్వీసుల నుండి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిం చారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అజయ్జైన్.. విజయానంద్లను తప్పించారు. సీఆర్డీఏ కమిషనర్గా పని చేసిన శ్రీధర్ స్థానంలో నిజాయితీ పరుడగా పేరున్న లక్ష్మీ నరసింహంను నియమించారు. టీటీడీ జేఈవోగా ఎనిమిదేళ్లుగా తిరుమలలో పాతుకుపోయిన శ్రీనివాస రాజును బదిలీ చేసారు. ఇక, తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో మీ కోసం పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ..పార్టీ పీడ్ బ్యాక్కు సహకరించిన అధికారి అహ్మద్ బాబు పైన సీఎం వేటు వేసారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం అదేశించింది.